హైదరాబాద్, వెలుగు: అమెరికాలోని సిలికాన్ వ్యాలీ ఆవిష్కరణలు, కాలిఫోర్నియా ఇంధన రంగ అనుభవాలను తెలంగాణలో వినియోగించుకుని సరికొత్త ఇంధన విప్లవానికి శ్రీకారం చుడతామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. ఇంధన భద్రత, ఆర్థిక పోటీతత్వాన్ని బలోపేతం చేసేందుకు యూసీ బర్క్లీ ప్రతినిధులతో కలిసి పనిచేసేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు. ఆదివారం అమెరికా పర్యటనలో భాగంగా యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా, బర్క్లీ పరిధిలోని గోల్డ్మన్ స్కూల్ ఆఫ్ పబ్లిక్ పాలసీకి చెందిన ఇండియా ఎనర్జీ అండ్ క్లైమేట్ సెంటర్ (ఐఈసీసీ)ని భట్టి సందర్శించారు. ఈ సందర్భంగా భారత పునరుత్పాదక ఇంధన లక్ష్యాలు, తెలంగాణను స్వచ్ఛ ఇంధన రంగంలో గ్లోబల్ హబ్గా తీర్చిదిద్దే అంశాలపై ఉన్నతస్థాయి సమావేశంలో చర్చించారు.
2030 నాటికి భారత్ సాధించాల్సిన 500 గిగావాట్ల నాన్-ఫాసిల్ ఇంధన సామర్థ్యం, గ్రిడ్ ఆధునీకరణ, పారిశ్రామిక డీకార్బనైజేషన్, బ్యాటరీ ఇంధన నిల్వ వ్యవస్థలు, శక్తి పరివర్తనపై చర్చ జరిగింది. తెలంగాణలో సౌరశక్తి సహా పునరుత్పాదక ఇంధన సామర్థ్యాన్ని వేగంగా పెంచుతున్న తీరును భట్టి వివరించారు. గ్రామీణ ప్రాంతాల్లో మహిళా స్వయం సహాయక సంఘాల భాగస్వామ్యంతో సోలార్ ప్రాజెక్టుల నిర్వహణ, పీఎం -కుసుమ్ పథకం ద్వారా రైతులకు స్వచ్ఛ ఇంధనం అందిస్తున్నట్లు తెలిపారు. 24 గంటల నాణ్యమైన విద్యుత్ సరఫరాతో పాటు క్లీన్టెక్ పరికరాల తయారీని ప్రోత్సహిస్తున్నట్లు పేర్కొన్నారు.
