
కౌలాలంపూర్: ఫామ్, ఫిట్నెస్ సమస్యలతో ఇబ్బంది పడుతున్న ఇండియా స్టార్ షట్లర్లు పీవీ సింధు, హెచ్ఎస్ ప్రణయ్ మరో పరీక్షకు సిద్ధమయ్యారు. మంగళవారం మొదలయ్యే మలేసియా మాస్టర్స్ సూపర్ 500 టోర్నమెంట్తో తిరిగి ఫామ్లోకి రావాలని ఆశిస్తున్నారు. 16వ ర్యాంక్కు పడిపోయిన సింధు విమెన్స్ సింగిల్స్ తొలి రౌండ్లో జపాన్కు చెందిన 20వ ర్యాంకర్ నాట్సుకి నిడైరాతో తలపడనుంది. మాళవిక బన్సోద్, ఉన్నతి హుడా, ఆకర్శి కశ్యప్ కూడా బరిలో నిలిచారు.
మాళవిక, ఉన్నతి చైనీస్ తైపీకి చెందిన చియు పిన్-చియాన్, లిన్ హ్సియాంగ్ టితో తలపడనున్నారు. ఆకర్షికి ఎనిమిదో సీడ్ పుత్రీ కుసుమ వార్డనీ (ఇండోనేసియా)తో కఠిన సవాల్ ఎదురవనుంది. మెన్స్ సింగిల్స్లో 35వ ర్యాంకర్ ప్రణయ్ తొలి రౌండ్లో జపాన్ స్టార్, ఐదో సీడ్ కెంటా నిషిమోటోతో అమీతుమీ తేల్చుకోనున్నాడు.
సతీష్ కరుణాకరన్, ఆయుష్ షెట్టితో పాటు డబుల్స్లో హరిహరన్– రూబన్ కుమార్, విమెన్స్ డబుల్స్లో కవిప్రియ సెల్వం– సిమ్రాన్ సింఘీ, వైష్ణవి ఖడ్కేకర్–అలీషా ఖాన్, ప్రేరణ అల్వేకర్– మృణ్మయీ జోడీలు, మిక్స్డ్ డబుల్స్లో ధ్రువ్ కపిలా–తనీషా క్రాస్టో, రోహన్ కపూర్–రుత్వికా శివాని, సతీష్– ఆద్య వరియత్ జంటలు బరిలో నిలిచాయి. వరల్డ్ మాజీ నంబర్ వన్ కిడాంబి శ్రీకాంత్, మన్నెపల్లి తరుణ్ తదితరులు క్వాలిఫయర్స్లో అదృష్టం పరీక్షించుకోనున్నారు.