కొద్దిరోజుల క్రితం ఇండోనేషియా నుంచి వచ్చిన టీమ్ లు.. ఇప్పుడు ఢిల్లీ మర్కజ్ మసీదులో ప్రార్థనలకు వెళ్లొచ్చిన వారు తెలుగు రాష్ట్రాలకు వణుకు పుట్టిస్తున్నారు. మన రాష్ట్రంలో మొదట వైరస్ సోకినట్లు గుర్తించిన ఇండోనేషియా టీమ్ సభ్యులందరూ తబ్లిగి జమాత్ సంస్థకు చెందిన వారే. మర్కజ్ సమావేశాల నుంచి కరీంనగర్ వచ్చిన వీరందరికీ పాజిటివ్ అని తేలింది . వెంట వచ్చిన యూపీ వ్యక్తి కి, కాంటాక్టయిన కరీంనగర్ స్థానికుడికి వైరస్ అంటుకుంది . వీరితో వచ్చిన మరో టీమ్ తమిళనాడు వెళ్లింది . అక్కడ మసీదుల్లో బస చేసిన వారిలో ముగ్గురికి పాజిటివ్ అని తేలింది . అక్కడి బాధితులందరూ థాయ్ లాండ్ వారని, తబ్లిగి జమాత్ సంస్థకు చెంది న ప్రచారకులు అని తేలింది తమిళనాడులో ఇప్పటివరకు 234 కేసులు నమోదవగా.. రెండు రోజుల్లో ఈ లిస్ట్లో చేరిన 155 మంది మర్కజ్ కు హాజరైన వారే.
మలేషియా నుంచి ఇక్కడికి..
తబ్లిగి జమాత్ టీమ్లకు వైరస్ ఎక్కడ సోకింది? ఎక్కడ నుంచి ఇక్కడకు వచ్చిందనే డిస్కషన్ మొదలైంది. రాష్ట్రంతోపాటు తమిళనాడులో వచ్చిన పాజిటివ్ కేసులను విశ్లేషించిన డాక్టర్లు.. మలేషియాతో వీళ్లకు లింక్లు ఉన్నాయని గుర్తించారు. అక్కడి నుంచే వైరస్ దిగుమతి అయిందనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఇస్లాం మత ప్రచార సంస్థగా పేరొందిన తబ్లిగి జమాత్ మలేషియాలోని కౌలాలంపూర్ లో ఫిబ్రవరి 27 నుంచి మార్చి 1 వరకు భారీ సదస్సు నిర్వహించింది. దీనికి 16 వేల మంది హాజరయ్యారు. ఇతర దేశాల వాళ్లు 1,500 మందికిపైగా ప్రార్థనల్లో పాల్గొన్నారు. ఈ సదస్సులో పాల్గొన్న మూడు వేల మందికి వైరస్ సోకినట్లు తేలింది. అదేమన దేశానికి విస్తరించిందని నిపుణులు భావిస్తున్నారు. రాష్ట్రంతోపాటు దక్షిణాది రాష్ట్రాల్లో అడుగుపెట్టిన తబ్లిగ్టీమ్లన్నీ మలేషియా సదస్సులో పాల్గొన్నాయి. అక్కడి నుంచి మార్చి 6న కొందరు.. మార్చి 9న ఇంకొందరు ఢిల్లీ చేరుకున్నారు. వీరంతా మర్కజ్ మసీదులో జరిగిన సమావేశాల్లో పాల్గొని వివిధ రాష్ట్రాలకు బయల్దేరారు.
ట్రేసింగ్పై దృష్టి..
ప్రపంచవ్యాప్తంగా ఇస్లాం మత సిద్ధాంతాలు, ప్రవచనాలను ప్రచారం చేసే మత సంస్థ తబ్లిగ్ జమాత్. దీని ప్రధాన కార్యాలయం ఢిల్లీలోని నిజాముద్దీన్ మర్కజ్. 213 దేశాల్లో ఈ సంస్థ కార్యకలాపాలు విస్తరించాయి. ఢిల్లీ మర్కజ్ సమావేశాలకు నేపాల్, మలేషియా, మయన్మార్, ఇండోనేషియా, థాయిలాండ్, శ్రీలంక, బంగ్లాదేశ్, ఇంగ్లాండ్, ఫ్రాన్స్, సింగపూర్ నుంచి 400 మందికి పైగా హాజరైనట్లు గుర్తించారు. వీరిలో ఇండోనేషియా, థాయ్లాండ్కు చెందిన వారే 150 మంది. విదేశాల నుంచి వచ్చిన 842 మంది తబ్లిగి కార్యకలాపాల్లో భాగంగా వివిధ రాష్ట్రాల్లో ఉన్నట్లు కేంద్రం అన్ని రాష్ట్రాలను అప్రమత్తం చేసింది. వీరిలో 82 మంది తెలంగాణలో.. 24 మంది ఏపీలో ఉన్నట్లు హెచ్చరించింది.
అలర్ట్ చేస్తే ముప్పు తప్పేది!
తబ్లిగిజమాత్ టీమ్లు మార్చి 2వ వారంలోనే ఢిల్లీ నుంచి రైళ్లలో చెన్నై, రామగుండం, హైదరాబాద్చేరుకున్నాయి. జమాత్లో పాల్గొన్న ఇండోనేషియన్లకు పాజిటివ్ వచ్చినట్లు మార్చి 18న బయటపడింది. అప్పుడే కేంద్రాన్ని అలర్ట్ చేసినట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. కానీ ఢిల్లీ మర్కజ్సదస్సుకు హాజరైన వారిని అప్రమత్తం చేయకపోవటంతో పరిస్థితి చేజారిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. 18న ఇండోనేషియన్లకు పాజిటివ్ వస్తే, జమాత్ వెళ్లొచ్చిన వాళ్లు టెస్టులకు రావాలని మార్చి 30న ప్రభుత్వం పిలుపునిచ్చింది. ఈ గ్యాప్లో వైరస్ బారిన పడ్డవాళ్లు, కుటుంబ సభ్యులకూ అంటించారు. కొంతమంది ప్రాణాలు కోల్పోయారు. రాష్ట్రంలో ఇప్పటివరకు చనిపోయిన ఆరుగురు జమాతే ప్రార్థనల్లో పాల్గొన్నవారే.

