మల్లన్నసాగర్ ప్యాకేజీ దేశానికే ఆదర్శం

మల్లన్నసాగర్ ప్యాకేజీ దేశానికే ఆదర్శం

సిద్దిపేట, వెలుగు : కొమురవెల్లి మల్లన్నసాగర్‌‌‌‌ ముంపు గ్రామాలకు తెలంగాణ ప్రభుత్వం అందజేస్తున్న ఆర్‌‌‌‌అండ్‌‌ఆర్‌‌‌‌ ప్యాకేజీ పరిహారం దేశానికే ఆదర్శంగా నిలుస్తుందని సిద్దిపేట, రాజన్న సిరిసిల్ల కలెక్టర్లు క్రిష్ణభాస్కర్‌‌‌‌, వెంకటరామిరెడ్డి అన్నారు. బుధవారం తొగుట మండలం వేములఘాట్‌‌‌‌, ఏటిగడ్డ కిష్టాపూర్‌‌‌‌ గ్రామాల్లో ముంపు నిర్వాసితులకు చెక్కుల పంపిణీ కార్యక్రమంలో వారు మాట్లాడారు. ముంపు గ్రామాల్లో రైతులు కోల్పోయిన భూములు, వ్యవసాయ కొట్టాలు, బావులు, బోర్లు, చెట్లు, తోటలు, పైప్‌‌‌‌లైన్ల కు ఇప్పటివరకు ప్రభుత్వం పరిహారం అందించిందన్నారు. పునరుపాధి, పునరావాస ప్యాకేజీ కింద అందిస్తున్న సాయం దేశంలో ఇప్పుడిస్తున్న ప్యాకేజీల కంటే ఎన్నో రెట్లు ఉత్తమంగా ఉందన్నారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా ప్రభుత్వమే ఇండ్లను నిర్మించి ఇస్తోందని, కేంద్ర చట్టాల కంటే నాలుగు రెట్లు మెరుగైన ప్యాకేజీలను ముంపు గ్రామ ప్రజలకు అందిస్తున్నట్టు వివరించారు.

ముంపు గ్రామాల ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి పరిహారాలను సంతోషంగా స్వీకరిస్తున్నారని అన్నారు. ఎవరైనా బెనిఫిట్స్ తీసుకోవడానికి నిరాకరిస్తే వారి వివరాలను, చెక్కులను కోర్టుకు సమర్పిస్తామని, తర్వాత నిర్వాసితులకు చెందాల్సిన పరిహారాన్ని చట్టప్రకారం కోర్టు ద్వారానే పొందాల్సి ఉంటుందని వెల్లడించారు. వేములఘట్‌‌‌‌ గ్రామంలో పరిహారం పంపిణీ కోసం వచ్చిన కలెక్టర్లు, సీపీలను  గ్రామ ప్రజలు పొలిమేరల నుంచి డప్పు చప్పుళ్లతో ఊరేగింపుగా తీసుకువచ్చారు. ఈ సందర్భంగా ఒక మహిళ కలెక్టర్లకు మంగళ హారతి ఇచ్చి వారికి తిలకం దిద్ది స్వాగతం పలికింది. పలువురు గ్రామస్తులు సీఎం కేసీఆర్‌‌‌‌ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు.