బీజేపీ రాజకీయ కక్ష సాధింపులకు పాల్పడుతోంది : మల్లిఖార్జున ఖర్గే

బీజేపీ రాజకీయ కక్ష సాధింపులకు పాల్పడుతోంది : మల్లిఖార్జున ఖర్గే

ఆదానీ వ్యవహారంపై JPC( జాయింట్ పార్లమెంటరీ కమిటీ)కి తాము పట్టుబట్టినందుకే  బీజేపీ రాజకీయ కక్ష సాధింపులకు పాల్పడుతోందని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే ఆరోపించారు. రాహుల్ గాంధీ మాట్లాడిన మాటలను పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నారు. నిజాలు మాట్లాడేవారిని బయటకు పంపే చర్యలకు బీజేపీ పాల్పడుతుందని మండిపడ్డారు.   మరోవైపు రాహుల్ గాంధీపై అనర్హత వేటు పడటాన్ని  కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేష్ తప్పుబట్టారు. దీనిపై చట్టపరంగా, రాజకీయంగా తాము పోరాటం చేస్తామని పేర్కొన్నారు.  దేశంలో ప్రజాస్వామ్యం చచ్చిపోయిందని ఆయన తెలిపారు. 

2019 కర్ణాటకలో  లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా కోలార్‌లో నిర్వహించిన ర్యాలీలో ప్రధాని మోడీని కించపర్చే విధంగా రాహుల్ గాంధీ ప్రసంగించారు.  మోడీ ఇంటి పేరు ఉన్నవారందరూ దొంగలు అంటూ అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. దీనిపై గుజరాత్‌ బీజేపీ ఎమ్మెల్యే పూర్ణేశ్‌ మోడీ.. సూరత్‌ కోర్టులో పరువునష్టం దావా వేశారు. దీనిపై విచారించిన  కోర్టు... రాహుల్‌ గాంధీ వాంగ్మూలాన్ని నమోదు చేసింది. తాను అలా అనలేదని రాహుల్‌ వివరణ ఇచ్చారు. అయితే  కోర్టు మాత్రం రాహుల్ గాంధీని దోషిగా తేల్చి..రెండేళ్లు జైలు శిక్ష విధించింది. రూ.15 వేల అపరాధం కూడా విధించింది. 

ప్రజాప్రాతినిధ్యం చట్టం ప్రకారం రెండేళ్లు లేదా అంతకంటే ఎక్కువ జైలుశిక్ష పడిన వ్యక్తి తీర్పు వెలువడిన తేదీ నుంచి రాజ్యంగ పదవుల్లో ఉండటానికి గానీ లేదా ఎన్నికల్లో పోటీ చేయడానికి గానీ వీల్లేదు.  ఈ నేపథ్యంలోనే లోక్ సభ జనరల్ సెక్రటరీ రాహుల్ గాంధీపై అనర్హత వేటు వేశారు.