
- జూబ్లీహిల్స్ బైపోల్, జీహెచ్ఎంసీ ఎన్నికలకు సిద్ధం కావాలి: మంత్రి పొన్నం
హైదరాబాద్, వెలుగు: కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే చీఫ్ గెస్టుగా జులై 4న హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో నిర్వహించనున్న బహిరంగ సభను సక్సెస్ చేయాలని పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ పిలుపునిచ్చారు. ఆదివారం గాంధీ భవన్ లో హైదరాబాద్ జిల్లా కాంగ్రెస్ నేతలతో మహేశ్గౌడ్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సభకు సిటీ నుంచి పెద్ద సంఖ్యలో జనాన్ని తరలించాలని సూచించారు.
ఆ రోజు ఉదయం గాంధీ భవన్ లో పీసీసీ రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశంలో ఖర్గే పాల్గొంటారని, అనంతరం జై బాపు, జై భీం, జై సంవిధాన్ కార్యక్రమంలో పాల్గొని సాయంత్రం బహిరంగ సభలో ప్రసంగిస్తారని చెప్పారు. ఖర్గే దేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో పర్యటిస్తున్నారని, అందులో భాగంగానే హైదరాబాద్ సభలో పాల్గొంటారని అన్నారు. రాజ్యాంగ పరిరక్షణ కోసమే ఆయన ఈ సభలకు హాజరవుతున్నారని చెప్పారు.
నామినేటెడ్ పదవులు భర్తీ చేస్తం
అనంతరం హైదరాబాద్ జిల్లా ఇంఛార్జీ మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ.. హైదరాబాద్ లో జరగనున్న ఖర్గే సభను విజయవంతం చేసేందుకు ఈ జిల్లా పరిధిలోని ప్రతి ఒక్క నియోజకవర్గం నుంచి పెద్ద సంఖ్యలో జనాన్ని తరలించాలని పిలుపునిచ్చారు. జీహెచ్ఎంసీ ఎన్నికలకు ఇప్పటి నుంచే పార్టీ కార్యకర్తలు సన్నద్ధం కావాలని కోరారు. ఈసారి ఎలాగైనా సరే మేయర్ సీటును కాంగ్రెస్ దక్కించుకోవాలని అన్నారు. అలాగే త్వరలో జరగనున్న జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ విజయం సాధించేందుకు ఇప్పటి నుంచే జనాల్లోకి వెళ్లాలని సూచించారు.
పార్టీ కోసం కష్టపడే వారికి త్వరలో భర్తీ చేయనున్న రాష్ట్ర స్థాయి నామినేటెడ్ పదవులు ఇస్తామని, వీటితో పాటు దేవాలయ, మార్కెట్ కమిటీ పాలక మండళ్ల పదవులు ఇస్తామని చెప్పారు. ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ మాట్లాడుతూ.. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుస్తుందన్నారు. కార్యక్రమంలో ఎంపీ అనిల్ కుమార్ యాదవ్, ఎమ్మెల్సీలు బల్మూరి వెంకట్, ఆమేర్ అలీ ఖాన్, కాంగ్రెస్ నేతలు అంజన్ కుమార్ యాదవ్, మెట్టు సాయి కుమార్, సిటీ కార్పొరేటర్లు తదితరులు పాల్గొన్నారు.
రాష్ట్రానికి నష్టం చేస్తున్న బీఆర్ఎస్: పొన్నం
ప్రతిపక్ష బాధ్యతలు వదిలి, శత్రు దేశంగా సొంత రాష్ట్రానికి నష్టం కలిగేలా బీఆర్ఎస్ నేతలు వ్యవహరిస్తున్నారని మంత్రి పొన్నం ఆరోపించారు. హైదరాబాద్ జిల్లా కాంగ్రెస్ సమావేశానికి ముందు గాంధీ భవన్ లో మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలను పరిష్కారం చేస్తూ పోతున్నామని, అయితే బీఆర్ఎస్ నేతలు ప్రభుత్వ ఉద్యోగులను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. ప్రతిపక్షంగా బీఆర్ఎస్ బాధ్యతారహితంగా వ్యవహరించినందుకు పార్లమెంట్ ఎన్నికల్లో ఆ పార్టీకి సున్నా సీట్లు ఇచ్చినా, వారి తీరు మారలేదని ధ్వజమెత్తారు.