
- 2021 తో పోలిస్తే 2022 లో 31 శాతం అప్
న్యూఢిల్లీ: రోజు రోజుకి ఇంటర్నెట్ వాడకం పెరుగుతుండడంతో మాల్వేర్ అటాక్స్ కూడా ఎక్కువవుతున్నాయి. 2021 తో పోలిస్తే కిందటేడాది మాల్వేర్ అటాక్స్ 31 శాతం పెరిగాయని యూఎస్ సైబర్ సెక్యూరిటీ సొల్యూషన్స్ కంపెనీ సోనిక్వాల్ రిపోర్ట్ వెల్లడించింది. దీంతో సైబర్ అటాక్స్కు వ్యతిరేకంగా కంపెనీలు వివిధ చర్యలు తీసుకోవడం పెంచాయంది. సిస్టమ్స్లోకి గుర్తుతెలియని వారు చొరబడడానికి ప్రయత్నించడం కిందటేడాది 10 శాతం పెరిగిందని పేర్కొంది. 2021 తో పోలిస్తే 2022 లో ర్యాన్సమ్వేర్ అటాక్స్ 53 శాతం పెరిగాయని, క్రిప్టోలను దొంగిలించడానికి జరిగిన అటాక్స్ ఏకంగా 116 శాతం పెరిగాయని ‘2023 సోనిక్వాల్ సైబర్ త్రెట్ రిపోర్ట్’ వివరించింది. ఐఓటీలపై అటాక్స్ 84 శాతం పెరిగాయంది. గ్లోబల్గా చాలా చోట్ల మాల్వేర్ అటాక్స్ తగ్గుతున్నప్పటికీ, ఇండియాలో మాత్రం పెరిగాయని సోనిక్వాల్ వైస్ ప్రెసిడెంట్ దేవాశిష్ ముఖర్జీ వెల్లడించారు. ఇండియా వంటి దేశాల్లో సైబర్ మోసగాళ్లు ఎక్కువయ్యారని, వీరు వివిధ మార్గాలను ఎంచుకుంటున్నారని ఈ రిపోర్ట్ పేర్కొంది. సైబర్ నేరగాళ్లు మోసాలు చేయడానికి కొత్త కొత్త విధానాలను వాడుతుండడంతో ఇండియాలో సైబర్ అటాక్స్ ఎక్కువవుతున్నాయని ముఖర్జీ పేర్కొన్నారు. ఐఓటీ, క్రిప్టో జాకింగ్ వంటి కొత్త అవెన్యూలను కూడా సైబర్ నేరగాళ్లు విడిచి పెట్టడం లేదన్నారు.
సైబర్ అటాక్స్ నుంచి తమను తాము కాపాడుకోవడానికి కంపెనీలు కొత్త టెక్నిక్స్ను, స్ట్రాటజీలను ఫాలో కావాల్సి ఉందని చెప్పారు. ఎటువంటి సైబర్ అటాక్స్ జరిగినా వెంటనే తెలిసేలా సిస్టమ్ను డెవలప్ చేసుకోవాలని, అప్పుడే బిజినెస్లు సమర్ధవంతంగా మాల్వేర్ అటాక్స్ను ఎదుర్కోగలవని అన్నారు. తమకు ఇండియా నుంచి వచ్చే బిజినెస్లో 55 శాతం పెద్ద కంపెనీల నుంచి, 45 శాతం చిన్న కంపెనీల నుంచి ఉందని సోనిక్వాల్ ప్రకటించింది. ఈ కంపెనీకి ఇండియాలో 500 కంటే ఎక్కువ మంది ఉద్యోగులున్నారు. బెంగళూరులోని తమ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ సెంటర్ను విస్తరిస్తామని సోనిక్వాల్ పేర్కొంది.