- రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న అధికారులు
లక్ష్మణచాంద(మామడ), వెలుగు : ఓ కేసు విషయంలో స్టేషన్ బెయిల్ఇస్తానంటూ రూ.10 వేలు లంచం తీసుకుంటూ నిర్మల్ జిల్లా మామడ ఎస్ఐ ఏసీబీకి పట్టుబడ్డారు. ఏసీబీ డీఎస్పీ రమణమూర్తి కథనం ప్రకారం..నిర్మల్ జిల్లా మామడ మండలంలోని అనంతపేటకు చెందిన సల్కం సతీశ్, సల్కం సురేశ్ అన్నదమ్ములు. ఇదే గ్రామానికి చెందిన సుప్పరి నరేశ్ అనే కిరాణా షాప్ యజమానితో ఈ నెల 24న గొడవ పడ్డారు.
ఈ విషయమై నరేశ్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా..సతీశ్, సురేశ్ లపై ఐపీసీ 323,341,291 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. అయితే ఇటీవలే బాధ్యతలు తీసుకున్న మామాడ ఎస్సై రాజు స్టేషన్ బెయిల్ ఇస్తానని నిందితులను రూ.10 వేల లంచం అడిగాడు. దీంతో నిందితుల అన్న సల్కం తిరుమల్ ఏసీబీని ఆశ్రయించాడు. వారి సూచన మేరకు ఆదివారం ఎస్సై రాజుకు లంచం ఇస్తుండగా రైడ్ చేసి రెడ్హ్యాండెడ్గా పట్టుకున్నారు. ఎస్సై రాజును విచారించి ఏసీబీ కోర్టుకు తరలించారు.

