కోల్కతా: బెంగాల్ సీఎం, తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ) చీఫ్ మమతా బెనర్జీ ఎన్నికల కమిషన్ పనితీరుపై సంచలన వ్యాఖ్యలు చేశారు. మంగళవారం పశ్చిమ మేదినీపూర్ జిల్లాలోని పింగ్లాలో జరిగిన బహిరంగ సభలో ఆమె మాట్లాడారు. ఎన్నికల కమిషన్ నిబంధనల్లో లాజికల్ డిస్క్రిపెన్సీ(డేటాలో తార్కికంగా ఉండకూడని వ్యత్యాసం) అనే పదం ఎక్కడా లేదని, దాన్ని కేవలం పశ్చిమ బెంగాల్లోనే అమలు చేస్తున్నారని ఆరోపించారు.
బిహార్ వంటి రాష్ట్రాల్లో లేని నిబంధనలను కేవలం బీజేపీకి లబ్ధి చేకూర్చడానికే ఈసీ బెంగాల్లో ప్రయోగిస్తోందని మండిపడ్డారు. తాము సుప్రీంకోర్టు వరకు వెళ్లడం వల్లే దాదాపు 32 లక్షల మంది ఓటర్ల పేర్లు మళ్లీ జాబితాలో చేరాయన్నారు.
విపత్తులు లేదా అల్లర్లు జరిగినప్పుడు కనిపించని కేంద్ర బలగాలు, ఇప్పుడు ఎందుకు వస్తున్నాయని ప్రశ్నించారు. పోలింగ్ కేంద్రాల వద్ద ఎవరైనా ఓటు వేయకుండా అడ్డుకుంటే మహిళలు ధైర్యంగా ఎదురుతిరగాలని పిలుపునిచ్చారు.

