మోడీ భార్యకు మమత శారీ గిఫ్ట్

మోడీ భార్యకు మమత శారీ గిఫ్ట్

ప్రధాని నరేంద్ర మోడీ భార్య జశోదాబెన్ కు పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఒక చీరను గిఫ్ట్ గా ఇచ్చారు. ఢిల్లీలో మోడీని కలిసేందుకు వెళ్తుండగా దీదీకి ఆమె ఎదురయ్యారు. మంగళవారం కోల్ కతా ఎయిర్ పోర్టులో విమానం ఎక్కేందుకు వచ్చిన మమతకు జశోదాబెన్ కనిపించారు. జార్ఖండ్, పశ్చిమబెంగాల్ లోని ప్రముఖ ఆలయాలను దర్శించి జశోద తిరిగి గుజరాత్ వెళ్తున్నారు. ఈ సందర్భంలో మమత ఎదురుపడడంతో ఇద్దరూ నవ్వుతూ పలకరించుకున్నారు. ఆ తర్వాత మోడీ భార్యకు దీదీ శారీ కానుకగా అందించారు. కాగా, మంగళవారం మోడీ 69వ పుట్టిన రోజు సందర్భంగా మమత ఆయనకు ట్విట్టర్ లో శుభాకాంక్షలు తెలిపారు. ఈ రోజు ఆమె తన రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై ప్రధానితో చర్చించేందుకు సమావేశమవుతున్నారు.