రైలు ప్రమాద బాధితులను ఆదుకునేందుకు దీదీ కీలక నిర్ణయం

రైలు ప్రమాద బాధితులను ఆదుకునేందుకు దీదీ కీలక నిర్ణయం

కోల్‌కతా : ఒడిశా రైలు ప్రమాదం బాధిత కుటుంబాలను ఆదుకునేందుకు పశ్చిమబెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కీలక నిర్ణయం తీసుకున్నారు. తమ రాష్ట్రానికి చెందిన మృతుల కుటుంబాల్లో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వనున్నట్టు ప్రకటించారు. అవయవాలు కోల్పోయిన వారి కుటుంబాలకు కూడా ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామన్నారు. కోరమాండల్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలు ప్రమాదంలో తీవ్ర గాయాలపాలై ప్రస్తుతం మానసిక, శారీరక గాయాలతో బాధపడుతున్నవారికి నగదు సాయం అందిస్తామన్నారు. మంగళవారం (జూన్ 6న) భువనేశ్వర్‌, కటక్‌ లోని ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న వారిని మమతా బెనర్జీ పరామర్శించనున్నారు. 

ప్రస్తుతం పశ్చిమ బెంగాల్‌కు చెందిన ప్రయాణికుల్లో 206 మంది గాయపడ్డారని.. వారంతా ఒడిశాలోని వేర్వేరు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారని మమతాబెనర్జీ చెప్పారు. వీరిలో 33 మంది పరిస్థితి విషమంగా ఉండగా.. వారంతా కటక్‌ ఆస్పత్రుల్లో చికిత్స తీసుకుంటున్నట్టు దీదీ తెలిపారు. కొందరు మంత్రులు, సీనియర్‌ ఉన్నతాధికారులు తనతో పాటు వస్తారని పేర్కొన్నారు. ఈ ఘటనలో బాధిత కుటుంబాలను బుధవారం (జూన్ 7న) కలిసి ఎక్స్‌గ్రేషియో చెక్కులతో పాటు ప్రభుత్వ ఉద్యోగ నియామక పత్రాలను కూడా మమత అందించనున్నారు. రైలు ప్రమాదం విషయంలో తాను ఎలాంటి రాజకీయాల జోలికి వెళ్లబోనన్న దీదీ.. క్షతగాత్రులు, వారి కుటుంబాలకు సాయం గురించే ఆలోచిస్తున్నట్టు చెప్పారు.