జగిత్యాల టౌన్, వెలుగు: జగిత్యాల కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన ప్రజావాణిలో కలెక్టర్ బి.సత్యప్రసాద్ అర్జీలు స్వీకరించారు. తన భూమి గ్రామ సర్పంచ్ ఆక్రమించాడని, తనకు న్యాయం చేయాలని జగిత్యాల జిల్లా మల్యాల మండలం నూకపల్లి గ్రామానికి చెందిన మారంపెల్లి నారాయణ పురుగు మందు డబ్బాతో గ్రీవెన్స్కు వచ్చాడు. అనంతరం తాను తెచ్చుకున్న పురుగు మందు డబ్బాను బయటకు తీయడంతో సిబ్బంది అప్రమత్తమై గుంజుకున్నారు. ఆక్రమణపై సమగ్ర విచారణ జరిపి న్యాయం చేస్తామని కలెక్టర్ బాధితుడికి హామీ ఇచ్చారు.
నర్సింగాపూర్ లో ప్రభుత్వ భూమిని మరోసారి ఆక్రమించి ఇటుక బట్టీలు ఏర్పాటుకు ప్రయత్నిస్తున్నారని సర్పంచ్ వంశీ, గ్రామస్తులు ఫిర్యాదు చేశారు. మెట్పల్లి మున్సిపల్ ఆఫీస్లో టౌన్ ప్లానింగ్ అధికారులు ఒకవైపు నిర్మాణానికి అనుమతులు ఇచ్చి, మరోవైపు పక్కవారి ద్వారా ఫిర్యాదులు చేయిస్తూ తమను వేధిస్తున్నారని జగ్గుల లావణ్య ప్రజావాణిలో ఫిర్యాదు చేసింది.
అర్జీలకు ప్రయారిటీ ఇచ్చి పరిష్కరించాలి
కరీంనగర్ టౌన్, వెలుగు: రాష్ట్ర ప్రభుత్వం ప్రజావాణి దరఖాస్తులకు అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని, ప్రజావాణి దరఖాస్తులను వారానికి మించి పెండింగ్లో ఉంచకుండా పరిష్కరించాలని కరీంనగర్ కలెక్టర్ చిత్రా మిశ్రా అన్నారు. సోమవారం కలెక్టరేట్లో నిర్వహించిన గ్రీవెన్స్లో ప్రజల నుంచి 226 దరఖాస్తులను స్వీకరించారు. కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్లు అశ్విని తానాజీ వాకడే, శ్రీనివాస్ రెడ్డి, ఆర్డీవోలు మహేశ్వర్, రమేశ్ బాబు, తదితరులు పాల్గొన్నారు.
నిజామాబాద్ ప్రజావాణిలో 128 ఫిర్యాదులు
నిజామాబాద్, వెలుగు: నిజామాబాద్కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన ప్రజావాణిలో జిల్లావ్యాప్తంగా 128 ఫిర్యాదులు అందాయి. అడిషనల్ కలెక్టర్కిరణ్కుమార్నేతృత్వంలో దరఖాస్తులను స్వీకరించిన ఆఫీసర్లు సంబంధిత శాఖలకు పంపారు. ప్రతి ఆర్జీని పరిష్కరించి వివరాలు సమర్పించాలని ఆదేశించారు. డీఆర్డీవో సాయాగౌడ్, జడ్పీ సీఈవో సాయన్న తదితరులు పాల్గొన్నారు. పిటిషన్లు అందజేయడానికి వచ్చిన ప్రజలకు సీనియర్ సిటిజన్స్ ఫోరం తరపున మధ్యాహ్నం పులిహోర పెట్టారు. రాజస్థానీ వాకర్స్ గ్రూప్ తరఫున చల్లని మంచినీటి వసతి కల్పించారు.

