హైదరాబాద్: నగరంలోని జగద్గిరిగుట్టలో దారుణం జరిగింది. స్థానిక ఆర్పీ కాలనీలో ఫయాజ్ అనే వ్యక్తిని కిరాతకంగా హత్య చేశారు. వెంటాడి కత్తులతో దాడిచేసి చంపారు. సుమారు పది మంది ఉన్నట్టు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. బాల్నగర్ ఏసీపీ పురుషోత్తం తెలిపిన వివరాల ప్రకారం.. బంజారాహిల్స్లో నివాసం ఉంటోన్న ఫయాజ్… షహీన్ అనే మహిళతో సహజీవనం చేస్తున్నాడు. ఆమె జగద్గిరిగుట్టలో ఉండగా.. తరచుగా అక్కడికి వచ్చేవాడు. ఈ క్రమంలో తాజాగా జగద్గిరిగుట్టకు రాగా.. ప్రశాంత్, టిల్లు, సాయి, నరేష్ కలిసి అతడిని వెంటాడారు. ఈ క్రమంలో వారి నుంచి తప్పించుకోవడం కోసం ఆమె ఇంటి వద్దకు పరిగెత్తుకుంటూ వచ్చాడు. అక్కడకు వెళ్లిన ఆ నలుగురు ఫయాజ్ను రాళ్లతో కొట్టి చంపారు. ఈ నలుగురు వ్యక్తులు కలిసి తిరిగే వాళ్ళని ఏసీపీ తెలిపారు. నిందితులను పట్టుకోవడానికి స్పెషల్ టీమ్లను ఏర్పాటు చేశామని.. వారిని పట్టుకున్న తరువాత విచారణలో హత్య కు గల కారణాలు తెలుస్తాయని అన్నారు. నిందితులు పట్టుబడ్డారని.. హత్యకు గల కారణాలపై ఆరా తీస్తున్నామని ఏసీపీ పురుషోత్తం తెలిపారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామన్నారు.