హైదరాబాద్: జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం జరిగింది. భార్య గొడవ పడి తనను విడిచి వెళ్ళిపోయిందనే మనస్తాపంతో నడిరోడ్డుపై ఓ వ్యక్తి పెట్రోలు పోసుకుని నిప్పంటించుకున్నాడు. వెంటనే అక్కడున్న కొంతమంది యువకులు మంటలను ఆర్పే ప్రయత్నం చేశారు. కానీ అప్పటికే అతని శరీరం 60 శాతం కాలిపోవడంతో చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.
వివరాల్లోకి వెళ్తే… జీడిమెట్ల పి.యస్. పరిధిలోని చింతల్, సుదర్శన రెడ్డి నగర్ లో భువన్ సూర్య(30), అతని భార్య, కూతురుతో ఓ భవనంలో ఆద్దెకు నివాసం ఉంటున్నాడు. సూర్య ఓ ప్రైవేట్ కార్యాలయంలో సేల్స్ ఎక్సగ్జీటీవ్ గా పని చేస్తుండగా.. అతని భార్య వారు అద్దెకుండే భవనంలోనే బ్యూటీ పార్లర్ షాపు నడుపుతుంది. తరచూ భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతుండేవి. గత 20 రోజుల క్రితం భార్యాభర్తల మధ్య గొడవ జరగడంతో భార్య తన అక్క ఇంటికి వెళ్ళిపోయింది. దీంతో కోపోద్రిక్తుడైన సూర్య తాగిన మైకంలో ఓ మిత్రునితో కలిసి తన భార్య ఉంటున్న బంధువుల ఇంటికి వెళ్ళి తీవ్రంగా కొట్టాడు. దీంతో అతని భార్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు జీడిమెట్ల పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు అయ్యింది.
అప్పటి నుండి అతని భార్య, కూతురు తన బంధువుల ఇంటి వద్దనే ఉండిపోయింది. సూర్య ఇంటికి రమ్మని ఎన్నోవిదాలుగా ప్రయత్నంచినా భార్య తన ఇంటికి రాకపోవడంతో తీవ్ర మనస్దాపానికి గురై శుక్రవారం మధ్యాహ్నం తాను నివాసం ఉంటున్న భవనం కిందకు వచ్చి తన ఒంటిపై పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకొని ఆత్మహత్య యత్నం చేశాడు.
వెంటనే స్థానికులు అతనిపై బట్టలు కప్పి మంటలను అదుపులోకి తెచ్చారు. తన చావుకి ఎవరూ బాధ్యులు కారని, తన దహన సంస్కారాలకు డబ్బులు కూడా తన వద్ద లేవని ఓ సుసైడ్ నోట్ కూడా రాశాడు. సమాచారం అందుకున్న జీడిమెట్ల పోలీసులు కేసు నమోదు చేసుకొని భాధితుడిని అంబులెన్స్ లో చికిత్స నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. భార్యాభర్తల మధ్య గొడవే భువన సూర్య ఆత్మహత్య యత్నంకు కారణం అని పోలీసులు, స్దానికులు భావిస్తున్నారు.