
హైదరాబాద్ లోని రాజేంద్రనగర్ లో దారుణం జరిగింది.. డబ్బుల విషయంలో గొడవ కారణంగా ఓ యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. శుక్రవారం ( మే 30 ) జరిగిన ఈ ఘటనకు సంబందించి పూర్తి వివరాలిలా ఉన్నాయి.. సాయి కార్తీక్ అనే యువకుడు తన స్నేహితుడైన సిద్దార్థ్ రెడ్డి దగ్గర రూ. 8 లక్షలు అప్పుగా తీసుకున్నాడు. డబ్బులు తిరిగి ఇవ్వడంలో ఆలస్యం అవ్వడంతో సిద్దార్థ్ రెడ్డి సాయి కార్తీక్ మధ్య గొడవలు మొదలయ్యాయి. డబ్బులు తిరిగి అడిగినందుకు సిద్దార్థ్ రెడ్డిని బెదిరించాడు సాయి కార్తీక్.
గురువారం అర్థరాత్రి రూమ్ లో ఫ్రెండ్స్ తో కలిసి మద్యం సేవించారు సాయి కార్తీక్, సిద్దార్థ్ రెడ్డి. మద్యం మత్తులో డబ్బుల గురించి వాగ్వాదం మొదలైంది. దీంతో ఒక్కసారిగా సాయికార్తీక్ పై దాడి చేసి హతమార్చాడు సిద్దార్థ్. సాయికార్తీక్ వరంగల్ వాసి అని.. సిద్దార్ట్ రెడ్డి పులివెందుల వాసిగా గుర్తించారు పోలీసులు. రాజేంద్రనగర్ లోని బుద్వేల్ లో చోటు చేసుకుంది ఈ ఘటన. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
ఈమధ్యకాలంలో హైదరాబాద్ లో ఇలాంటి ఘటనలు ఎక్కువవుతున్నాయి.. మే 11న హైదరాబాద్ లోని కూకట్ పల్లిలో దారుణ హత్య జరిగింది.. ఓ గ్యాంగ్ గంజాయి మత్తులో యువకుడిని దారుణంగా హత్య చేసిన ఘటన కూకట్ పల్లిలో చోటు చేసుకుంది. ఆదివారం ( మే 11 ) రాత్రి జరిగిన ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలిలా ఉన్నాయి... కేపీహెచ్బీ పోలీస్ స్టేషన్ పరిధిలోని సర్దార్ పటేల్ నగర్ లోని ఓ అపార్ట్ మెంట్ సమీపంలో ఉన్న పార్కులో గంజాయి సేవిస్తున్న ఐదుగురు యువకులు వెంకటరమణ అనే యువకుడిని ఐరన్ రాడ్డుతో పొడిచి దారుణంగా హత్య చేశారు. ఇనుప రాడ్డుతో గుండెల్లో గుచ్చగా తీవ్రంగా గాయపడ్డ వెంకటరమణ అక్కడిక్కడే మృతి చెందినట్లు తెలుస్తోంది.
నిందితులు పార్కులో గంజాయి సేవిస్తుండగా.. అపార్టుమెంట్ వాచ్మెన్తో పాటు వెంకటరమణ అనే యువకుడు తన మిత్రులతో కలిసి వారిని నిలదీయగా... ఆగ్రహానికి గురైన పవన్ అనే యువకుడు తన చేతిలో ఉన్న ఇనుప కడ్డీతో వెంకటరమణ గుండెల్లో గుచ్చినట్లు తెలుస్తోంది. ఘటనపై కేసు నమోదు చేసి నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు.