డాక్టర్​​కు చూపించుకునేలోపే ఊపిరి పోయింది..ఛాతి నొప్పితో గాంధీకి వచ్చి,క్యూలోనే వ్యక్తి మృతి

డాక్టర్​​కు చూపించుకునేలోపే ఊపిరి పోయింది..ఛాతి నొప్పితో గాంధీకి వచ్చి,క్యూలోనే వ్యక్తి మృతి

పద్మారావునగర్, వెలుగు: ఛాతి నొప్పితో గాంధీ దవాఖానకు వచ్చిన ఓ వ్యక్తి తన సమస్యను డాక్టర్​కు చూపించుకునేందుకు క్యూలో నిల్చునే ప్రాణాలు కోల్పోయాడు. బన్సీలాల్ పేట డివిజన్​లోని చాచానెహ్రూ నగర్​కు చెందిన జంగిటి నంద కిషోర్ ముదిరాజ్(37) ప్రైవేట్​ఉద్యోగి. ఆయనకు భార్య, కూతురు ఉన్నారు. శుక్రవారం ఉదయం ఛాతిలో నొప్పి రావడంతో  గాంధీ దవాఖానలో ఓపీ తీసుకున్నాడు. కార్డియాలజీ డాక్టర్​ను సంప్రదించగా ఈసీజీ తీసుకొని రమ్మని సూచించారు. 

ఈసీజీ రిపోర్ట్ తీసుకొని తిరిగి డాక్టర్ వద్దకు వచ్చి క్యూలో నిల్చున్నాడు. ఈ క్రమంలో నిల్చున్న చోటే కుప్పకూలి మృతి చెందాడు. తీవ్రమైన గుండె నొప్పితో ఉన్న వ్యక్తిని ముందుగా చూడకుండా నిర్లక్ష్యం చేయడం వల్లే తన భర్త చనిపోయాడని భార్య వాపోయింది. ఈ ఘటనపై ఉన్నతాధికారులను ఫిర్యాదు చేస్తామని కుటుంబ సభ్యులు తెలిపారు.

హాస్టల్​లో వ్యక్తి..

కూకట్​పల్లి: కేపీహెచ్​బీ పరిధిలోని మెన్స్ పీజీ హాస్టల్లో ఉంటున్న ఓ వ్యక్తి అకస్మాత్తుగా కిందపడి మృతి చెందాడు. బాచుపల్లికి చెందిన శ్రావణ్​కుమార్​(42) కేపీహెచ్​బీ పరిధి అడ్డగుట్ట సొసైటీలోని శ్రీనివాస మెన్స్​పీజీ హాస్టల్​లో ఉంటూ ఉద్యోగం కోసం సన్నద్ధమవుతున్నాడు. శనివారం మధ్యాహ్నం 3 గంటల సమయంలో హాస్టల్​లో కుప్పకూలి చనిపోయాడు. పోలీసులు డెడ్​బాడీని పోస్టుమార్టం కోసం గాంధీకి తరలించారు.