- అవమానం తట్టుకోలేక వ్యక్తి సూసైడ్
వికారాబాద్, వెలుగు : ‘‘మా సంబంధానికి అడ్డుగా ఉన్నావ్.. నువ్వు చస్తేనే మేం ఆనందంగా ఉంటాం” అని భార్య, ఆమె ప్రియుడు వేధించడంతో మనస్తాపానికి గురై ఓ వ్యక్తి ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఎస్సై అబ్దుల్ రావూఫ్ తెలిపిన వివరాల ప్రకారం.. వికారాబాద్ జిల్లా మర్పల్లి మండలం కొంశెట్టిపల్లి గ్రామానికి చెందిన బేగరి శ్రీనివాస్ (42)కు 22 ఏండ్ల కింద రత్నమాలతో పెండ్లి జరిగింది. వీరికి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. అయితే రత్నమాల అదే గ్రామానికి చెందిన మన్నె అనంతితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. మన్నె అనంతి తరచూ రత్నమాల దగ్గరికి వస్తుండడంతో రెండు నెలల కిందట భర్త శ్రీనివాస్ నిలదీయగా ఇద్దరి మధ్య గొడవ జరిగింది.
ఈ నెల 5న రత్నమాల ఇంట్లో ప్రియుడు ఉండగా, శ్రీనివాస్ పట్టుకున్నాడు. ఆ సమయంలో భార్య, ప్రియుడు కలిసి శ్రీనివాస్ను దారుణంగా దూషించడమే కాకుండా ‘‘నువ్వు చస్తేనే మేము ఆనందంగా ఉంటాం’’ అంటూ కొట్టారు. ఈ అవమానాన్ని తట్టుకోలేక తీవ్ర ఆవేదనకు గురైన శ్రీనివాస్ ఆదివారం రాత్రి తన గదిలో గడియ పెట్టుకుని ఫ్యాన్కు ఉరేసుకొని మృతి చెందాడు. ఈ ఘటనపై శ్రీనివాస్ సోదరి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని వికారాబాద్ పోలీసులు తెలిపారు.
వర్క్ ప్రెజర్తో ఐటీ ఉద్యోగిని..
గచ్చిబౌలి, వెలుగు: పని ఒత్తిడి తట్టుకోలేక ఓ సాఫ్ట్వేర్ ఉద్యోగిని ఆత్మహత్య చేసుకుంది. కొండాపూర్ మజీద్బండలోని సుమధుర హారిజన్ అపార్ట్మెంట్లో నివాసం ఉంటున్న మనుశ్రీ విజయ్ సమీల్ (32) హైటెక్ సిటీలోని ఓ కంపెనీలో సాప్ట్వేర్ ఇంజినీర్గా పనిచేస్తోంది. సోమవారం ఉదయం ఆమె తన గదిలో చున్నీతో ఫ్యాన్కు ఉరివేసుకొని మృతి చెందింది. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న గచ్చిబౌలి పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. ఆఫీసులో పని ఒత్తిడి (వర్క్ ప్రెజర్) కారణంగానే మనుశ్రీ ఈ అఘాయిత్యానికి పాల్పడినట్లు పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
