
- కత్తితో దారుణంగా నరికి చంపిన ఉన్మాది
- అడ్డొచ్చిన అమ్మాయి, సోదరుడిపైనా దాడి
- ఇద్దరికీ తీవ్ర గాయాలు.. హాస్పిటల్కు తరలింపు
- వరంగల్ జిల్లా చింతల తండాలో ఘటన
వరంగల్ / నర్సంపేట / హైదరాబాద్, వెలుగు: వరంగల్ జిల్లాలో దారుణం జరిగింది. లవ్ మ్యారేజ్కు నిరాకరించారనే కోపంతో అమ్మాయి తల్లిదండ్రులను యువకుడు కత్తితో నరికి చంపాడు. అడ్డొచ్చిన యువతితో పాటు ఆమె సోదరుడిపై దాడి చేశాడు. దీంతో వారిద్దరు హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు.
ఈ ఘటన వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండలం 16 చింతలతండాలో గురువారం తెల్లవారుజామున జరిగింది. బానోతు శ్రీనివాస్ (40), సుగుణ (35) భార్యాభర్తలు. వీరికి కొడుకు మదన్లాల్, కూతురు దీపిక ఉన్నరు. హనుమకొండలోని పింగిళి కాలేజీలో దీపిక డిగ్రీ చదువుతున్నప్పుడు మహబూబాబాద్ జిల్లా గూడురు మండలం గుండెంగ గ్రామానికి చెందిన ఆటో డ్రైవర్ నాగరాజు అలియాస్ బన్నీతో పరిచయం ఏర్పడింది.
అది కాస్త ప్రేమగా మారడంతో.. 2023, అక్టోబర్లో వీరిద్దరు ఇంటి నుంచి పారిపోయి ఎవరికీ తెలియకుండా పెండ్లి చేసుకున్నారు. తన కూతురు కనిపించడం లేదని తండ్రి శ్రీనివాస్ సుబేదారి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేశాడు. మిస్సింగ్ కేసుగా నమోదు చేసుకున్న పోలీసులు.. దీపిక, నాగరాజును స్టేషన్ను పిలిపించి కౌన్సిలింగ్ ఇచ్చారు. తాను నాగరాజుతోనే ఉంటానని దీపిక చెప్పడంతో తల్లిదండ్రులు అక్కడి నుంచి వెళ్లిపోయారు.
ఆ తర్వాత ఇద్దరు హైదరాబాద్లో కాపురం పెట్టారు. మూడు నెలల తర్వాత ఇద్దరి మధ్య గొడవలు మొదలయ్యాయి. 2024, జనవరిలో వీరి ఇష్యూ పోలీస్ స్టేషన్కు చేరింది. తర్వాత ఇరు కుటుంబాలు పంచాయితీ పెట్టాయి. చాటుగా చేసుకున్న పెండ్లి చెల్లదని, నాగరాజు, దీపిక విడిపోవాలని పెద్ద మనుషులు తీర్పు చెప్పారు. విడాకులు తీసుకోవాలని సూచించారు. దీనికి రెండు కుటుంబాలు ఓకే చెప్పాయి.
పెండ్లి సంబంధాలు చూస్తున్నారనే కోపంతో..
దీపికతో తాను విడిపోవడానికి ఆమె తల్లిదండ్రులే కారణమని నాగరాజు వారిపై కక్ష పెంచుకున్నాడు. ఆమెకు పెండ్లి సంబంధాలు చూస్తున్నారనే విషయం తెలుసుకుని.. బుధవారం రాత్రి మద్యం తాగి కత్తితో దీపిక ఇంటికి వెళ్లాడు. ఇంటి ముందు రేకుల షెడ్డు కింద పడుకున్న సుగుణ, శ్రీనివాస్పై కత్తితో దాడి చేశాడు. అరుపులకు ఇంట్లో పడుకున్న మదన్ లాల్, దీపిక బయటికి వచ్చేసరికి వాళ్లపైనా దాడికి పాల్పడ్డాడు.
తండా వాసులంతా రావడంతో నాగరాజు అక్కడి నుంచి పారిపోయాడు. సుగుణ స్పాట్లోనే చనిపోగా.. శ్రీనివాస్ హాస్పిటల్కు తరలిస్తుండగా మృతి చెందాడు. తీవ్రంగా గాయపడిన మదన్లాల్, దీపికను హనుమకొండలోని చక్రవర్తి హాస్పిటల్కు తరలించారు. ఘటనా స్థలాన్ని వరంగల్ ఈస్ట్ జోన్ డీసీపీ రవీందర్, నర్సంపేట ఏసీపీ కిరణ్ కుమార్, సీఐ చంద్రమోహన్, ఎస్సై అరుణ్ కుమార్ పరిశీలించి విచారణ చేపట్టారు.
కాగా, తండా వాసులు నాగరాజు వెంట పడటంతో గుండెంగ గ్రామానికి పారిపోయి మెయిన్ రోడ్డు పక్కనే ఉన్న అప్పర్ ప్రైమరీ స్కూల్లో దాక్కున్నాడు. విషయం గుండెంగ గ్రామస్తులకు తెలియడంతో.. అప్పుడే స్కూల్ నుంచి బయటికి వస్తున్న నాగరాజు పట్టుకుని పోలీసులకు అప్పగించారు. అతని వద్ద నుంచి పోలీసులు కత్తిని స్వాధీనం చేసుకున్నారు. మృతుల కుటుంబ సభ్యులు నాగరాజు ఊరుకెళ్లి అతని స్నేహితుడు పవన్పై దాడికి దిగారు. పోలీసులు వచ్చి అతన్ని కాపాడి అక్కడి నుంచి తీసుకెళ్లిపోయారు.
నర్సంపేటలో మృతుల కుటుంబ సభ్యుల రాస్తారోకో
నాగరాజును కఠినంగా శిక్షించాలంటూ మృతుల బంధువులు, గ్రామస్తులు నర్సంపేట టౌన్లో రాస్తారోకో చేశారు. బాధిత కుటుంబానికి రూ.50లక్షల పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. మృతుల బంధువులను ఈస్ట్ జోన్ డీసీపీ రవీందర్ నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. అయినా.. వారు వినిపించుకోకుండా మార్చురీ నుంచి పోలీస్ స్టేషన్కు చేరుకుని ఆందోళన చేపట్టారు.
ఆ తర్వాత వరంగల్ రోడ్డులోని అమరవీరుల స్మారక స్తూపం వద్ద నిరసన తెలిపారు. మృతుల కుటుంబ సభ్యులు పోలీసులకు వెంటనే ఫిర్యాదు చేయకపోవడంతో పోస్టుమార్టానికి ఆలస్యమైంది. కాగా, బాధిత కుటుంబ సభ్యులను నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి, వరంగల్ జడ్పీ ఫ్లోర్ లీడర్ పెద్ది స్వప్న పరామర్శించారు.
నిందితుడికి కఠిన శిక్ష పడేలా చేస్తాం: మంత్రి సీతక్క
శ్రీనివాస్, సుగుణను చంపిన నాగరాజుకు కఠిన శిక్ష పడేలా చేస్తామని మంత్రి సీతక్క బాధిత కుటుంబానికి హామీ ఇచ్చారు. ఉన్మాదిలా మారి ఇద్దరిని చంపడం దారుణమన్నారు. నిందితుడిని అరెస్ట్ చేసినట్లు తెలిపారు. బాధిత కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు. దీపిక, మదన్లాల్కు మెరుగైన వైద్యం అందిస్తున్నట్లు తెలిపారు. ఇద్దరికి రక్షణ కల్పిస్తామని చెప్పారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూస్తామన్నారు. పోలీసు, మహిళా శిశు సంక్షేమ శాఖల మధ్య సమన్వయం పెంచే చర్యలు తీసుకుంటామని తెలిపారు.