న‌గ‌రంలో దారుణం.. త‌మ్ముణ్ని ఉరేసి చంపిన అన్న

న‌గ‌రంలో దారుణం.. త‌మ్ముణ్ని ఉరేసి చంపిన అన్న

హైదరాబాద్: న‌గ‌రంలోని అంబ‌ర్‌పేట చెన్నారెడ్డి న‌గ‌ర్ లో దారుణం జ‌రిగింది. తరుచూ గొడవ పడుతున్నాడనే కోపంతో సొంత తమ్ముడినే ఉరేసి చంపాడు ఓ అన్న‌. మహ్మద్‌ మునావర్‌(32) అనే వ్య‌క్తి పదేళ్ల క్రితం స్థానికంగా ఉండే కల్పన అనే అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. వీరికి ఇద్దరు పిల్లలు. అయితే దంపతుల మధ్య గొడవలు చోటు చేసుకోవడంతో.. రెండేళ్ల క్రితం వీరిద్దరూ విడిపోయారు.అప్పట్నుంచి మునావర్‌ తీవ్ర మానసిక వేదనకు గురవుతున్నాడు. నిత్యం మద్యం సేవించి అన్న షాహిద్‌తో గొడవ పడేవాడు.

ఎప్ప‌టిలాగే మంగళవారం తెల్లవారుజామున ఒంటి గంట సమయంలో మద్యం మత్తులో ఉన్న మునావర్.. అన్న‌ షాహిద్‌తో గొడవకు దిగాడు. సహనం కోల్పోయిన షాహిద్‌.. తమ్ముడు మునావర్‌కు ఉరేసి చంపాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. షాహిద్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మృతుడి కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు.