- రూ.3 వేల కోసం వేధించిన ఏజెంట్లు
- డబ్బులు కట్టకపోతే న్యూడ్ఫొటోలు పంపుతమని మార్ఫింగ్ ఫొటోతో బ్లాక్మెయిల్
- తట్టుకోలేక హైదరాబాద్లో ఉరి వేసుకుని వ్యక్తి ఆత్మహత్య
ముషీరాబాద్, వెలుగు: యాప్ లోన్కు మరో యువకుడు బలయ్యాడు. లోన్డబ్బులు కట్టకపోతే మార్ఫింగ్ చేసి న్యూడ్ ఫొటోలు బంధువులకు పంపుతామంటూ వేధించడంతో హైదరాబాద్లో ఓ వ్యక్తి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మహారాష్ట్రకు చెందిన ప్రేమ్ కుమార్ (36), నాగమణి దంపతులు కొంతకాలంగా హైదరాబాద్ రాంనగర్లో ఉంటున్నారు. ప్రేమ్ కుమార్ క్యాంటీన్లకు అవసరమైన మెటీరియల్ సప్లై చేస్తుండగా.. నాగమణి ఆర్టీసీ క్రాస్ రోడ్స్లోని ఓ హాస్పిటల్ క్యాంటీన్లో పని చేస్తోంది. ప్రేమ్కుమార్ కొంతకాలం కింద ఓ యాప్ నుంచి పర్సనల్లోన్ తీసుకున్నాడు. ఆర్థిక పరిస్థితి బాగా లేకపోవడంతో ఒక నెల ఈఎంఐ కట్టలేదు. ఇటీవలే తన భార్య నాగమణితో కలిసి మేడారం జాతరకు వెళ్లాడు. తిరిగి వస్తున్న క్రమంలో లోన్ యాప్ ఏజెంట్లు ప్రేమ్కుమార్కు కాల్చేశారు. లోన్డబ్బులు కట్టాలని, లేకుంటే.. ఫొటోలు మార్ఫింగ్ చేసి మీ బంధువులుకు పంపుతామని బెదిరించారు. ప్రేమ్కుమార్ న్యూడ్ ఫొటోలు, వీడియోలు అతని వాట్సాప్కు పంపించారు. దీంతో షాక్కు గురైన ప్రేమ్కుమార్ కట్టాల్సింది రూ.3 వేలే అని, కొంచం టైం ఇస్తే కడతానని బతిమిలాడుకున్నాడు.
కొత్త కొత్త నంబర్ల నుంచి కాల్స్
డబ్బులు చెల్లించేందుకు కొంత సమయం ఇవ్వాలని ప్రేమ్కుమార్ రిక్వెస్ట్ చేసినా ఏజెంట్లు వినలేదు. పది నిమిషాలు, అరగంట, గంట అంటూ డెడ్లైన్లు పెట్టి కట్టకపోతే అతడి ఫోన్లో ఉన్న కాంటాక్ట్స్అన్నింటికీ ఆ ఫొటోలు, వీడియోలు పంపుతామని బెదిరించారు. దీంతో ఇదే విషయం తన భార్యకు చెప్పాడు. ‘ఇట్లా బ్లాక్మెయిల్ చేసేవారికి డబ్బులు పంపిస్తే వాళ్లు వదలరు. వేధిస్తూనే ఉంటరు. రేపు పోలీసులకు ఫిర్యాదు చేద్దాం’ అని చెప్పింది. బంధువులకు కూడా చెప్పగా వారు ఏమీ కాదని, భయపడవద్దని ధైర్యం చెప్పారు. అయితే, ఎజెంట్లు కొత్త కొత్త నంబర్ల నుంచి కాల్స్చేస్తూ బెదిరిస్తుండడంతో తీవ్రమైన ఒత్తిడికి గురయ్యాడు. తన పరువు పోతుందని మనోవేదనకు గురైన ప్రేమ్ కుమార్ మంగళవారం రాత్రి ఇంట్లో ఫ్యాన్కు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. భార్య నాగమణి డ్యూటీకి వెళ్లి రాత్రి 8:30కు ఇంటికి వచ్చింది. డోర్కొట్టినా తీయకపోవడంతో పోలీసులకు సమాచారం ఇచ్చింది. స్పాట్కు చేరుకున్న పోలీసులు ఇంటి కిటికీలు పగలగొట్టి లోపలకు వెళ్లారు. అక్కడ గదిలో ఉరి వేసుకున్న ప్రేమ్ కుమార్ కనిపించడంతో మృతదేహాన్ని కిందికి దింపి పోస్టుమార్టం కోసం గాంధీ దవాఖానకు తరలించారు. ప్రేమ్ కుమార్ ఫోన్ ల్యాబ్కు పంపించామని.. లోన్ఎవరి దగ్గర తీసుకున్నాడు? ఏ నంబర్ నుంచి బెదిరింపు కాల్స్ వచ్చాయి అన్నది విచారణలో తెలుస్తుందని సీఐ మల్లేశం తెలిపారు.
