నాకు కరోనా సోకలేదు..ఆస్పత్రి నుంచి తప్పించుకున్న పేషెంట్

నాకు కరోనా సోకలేదు..ఆస్పత్రి నుంచి తప్పించుకున్న పేషెంట్

కరోనా లక్షణాలున్న అనుమానితులకు వైద్యులు రక్త పరీక్షలు నిర్వహిస్తున్నారు. అయితే పరీక్షల రిజల్ట్ రాకముందే అనుమానితులు ఆస్పత్రుల నుంచి తప్పించుకోవడం కలకలం రేపుతుంది.

ఆదివారం దుబాయ్ నుంచి ఓ వ్యక్తి మంగళూరు ఎయిర్ పోర్ట్ లో దిగాడు. ఎప్పటిలాగే ఎయిర్ పోర్ట్ అధికారులు విదేశాల నుంచి, స్వదేశాల నుంచి వచ్చే ప్రయాణికులకు కరోనా టెస్ట్ లు నిర్వహించారు. అందులో ఓ  వ్యక్తికి కరోనా లక్షణాలున్నాయని అనుమానం వ్యక్తం చేసిన వైద్యులు ఐసోలేషన్ వార్డ్ లో ఉంచి రక్త పరీక్షలు నిర్వహించి..బ్లడ్ శాంపిల్స్ ను వైరాలజీ ల్యాబ్ కు పంపించారు. రిపోర్ట్ లు రావాల్సి ఉంది. బాధితుడికి జ్వరం ఎక్కువగా ఉండడంతో వెన్ లాక్ ఆస్పత్రికి తరలించారు. అయితే అర్ధరాత్రి బాధితుడు ఆస్పత్రి సిబ్బందితో గొడవపడ్డాడు. తనకు కరోనా లేదని, ఆస్పత్రిలో తనని ఎందుకు ఉంచారంటూ ప్రశ్నించాడు. అనంతరం ఆస్పత్రి నుంచి తప్పించుకున్నాడు.

పేషెంట్ పారిపోవడంతో అప్రమత్తమైన ఆస్పత్రి యాజమాన్యం పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఫిర్యాదుతో అలెర్ట్ అయిన పోలీస్ ఉన్నతాధికారులు మాట్లాడుతూ తాము అన్నీ తీర ప్రాంతాల పోలీసులకు సమాచారం అందించామని చెప్పారు. పోలీసుల సాయంతో  త్వరలోనే పేషెంట్ ను అదుపులోకి తీసుకొని ఐసోలేషన్ వార్డ్ కు తరలిస్తామని దక్షిణ కన్నడ జిల్లా ఆరోగ్య అధికారి సికందర్ పాషా తెలిపారు.