Bhairavam Review: ‘భైరవం’ ఫుల్ రివ్యూ.. సినిమా కథేంటీ? ముగ్గురు హీరోలు కమ్బ్యాక్ ఇచ్చేనా?

Bhairavam Review: ‘భైరవం’ ఫుల్  రివ్యూ.. సినిమా కథేంటీ? ముగ్గురు హీరోలు కమ్బ్యాక్ ఇచ్చేనా?

త‌మిళ ఇండస్ట్రీలో బ్లాక్‌బ‌స్ట‌ర్ హిట్ కొట్టిన ‘గ‌రుడ‌న్’ రీమేకే.. తెలుగు ‘భైరవం’.బెల్లంకొండ సాయి శ్రీనివాస్, మంచు మనోజ్, నారా రోహిత్ లీడ్ రోల్స్‌‌లో నటించిన ఈ మూవీ నేడు శుక్రవారం (మే30న) థియేటర్లలో విడుదలైంది.

‘నాంది, ఉగ్రం’ సినిమాల తర్వాత దర్శకుడు విజయ్ కనకమేడల ‘భైరవం’తెరకెక్కించారు. స్టార్ డైరెక్టర్ శంకర్ కుమార్తె అదితి శంకర్, ఆనంది, దివ్య పిళ్ళై హీరోయిన్లుగా నటించారు.

వరుస ప్లాప్స్ తో సతమవుతున్న ఈ ముగ్గురు హీరోలకి (బెల్లంకొండ సాయి, మనోజ్, నారా రోహిత్) భైరవం కమ్బ్యాక్ ఇచ్చేనా? సూపర్ హిట్ గరుడన్’ సినిమాను మార్పులు, చేర్పులు చేసి తీసిన ‘భైరవం’ కథేంటీ? ప్రేక్షకులను ఎంతవరకు ఆకట్టుకుంది? అనేది పూర్తి రివ్యూలో చూద్దాం. 

కథేంటంటే:

తూర్పు గోదావరి జిల్లాలోని దేవీపురం గ్రామం. అక్కడి వారాహి ఆలయ భూములను కాపాడే ముగ్గురు ప్రాణస్నేహితులు. గజపతి వర్మ (మంచు మనోజ్), గజపతి వర్మ దగ్గర పనిచేసే శ్రీను (బెల్లంకొండ సాయి శ్రీనివాస్).  గజపతి వర్మ స్నేహితుడు వరద (నారా రోహిత్). ఒకరికోసం ఒకరు అనేలా ఉంటారు.

వారాహి ఆలయ ధర్మకర్తగా గజపతి వర్మ నాయనమ్మ నాగరత్నమ్మ (జయసుధ) ఉంటుంది. అయితే, వారాహీ అమ్మవారి గుడికి చెందిన భూముల మీద దేవాదాయ శాఖ మంత్రి (శరత్ లోహితస్య) కన్నేస్తాడు.

ఈ క్రమంలో అనూహ్యంగా గజపతి వర్మ నాయనమ్మ నాగరత్నమ్మ చనిపోతుంది. ఉన్నట్టుండి గజపతి వర్మ దగ్గర పనిచేసే శ్రీను ధర్మకర్త అవుతాడు. అసలు ఓ పనివాడు ధర్మకర్త అవ్వడం వెనుక ఎవరున్నారు? వెయ్యి కోట్ల విలువైన ఆ భూమిని కాజేయాలని ఎవరెవరు ప్రయత్నిస్తారు? ప్రాణస్నేహితులుగా ఉండే వారి మధ్య ఎలాంటి విభేదాలు తలెత్తాయి?

స్నేహితుడిని ఎవరైనా చిన్నమాట అంటే ఊరుకోని గజపతి... వరదా మీద ఎటాక్ జరుగుతుంటే ఎందుకు మౌనంగా ఉన్నాడు? గజపతి వర్మ భార్య నీలిమ (ఆనంది), బావమరిది పులి (సందీప్ రాజ్), శ్రీను ప్రేమించిన అమ్మాయి వెన్నెల (అదితి శంకర్), వరద భార్య పూర్ణిమ (దివ్యా పిళ్లై), థియేటర్ రన్ చేసే నాగరాజు (అజయ్) సినిమాలో వీరి పాత్రలు ఎలాంటివి? కథలో ఒక్కో మనిషి వెనుక ఉన్న అసలు ముసుగు ఏంటనేది మిగతా స్టోరీ.

విశ్లేషణ:

మొదట త‌మిళ ఇండస్ట్రీలో బ్లాక్‌బ‌స్ట‌ర్ హిట్ కొట్టిన ‘గ‌రుడ‌న్’ రీమేక్‌ విషయానికి వస్తే.. విడుదల ఫేమ్ సూరి, M శశికుమార్ మరియు మలయాళ నటుడు ఉన్ని ముకుందన్‌ లు ప్రధాన పాత్రల్లో నటించి మెప్పించారు.

మే 31, 2024న విడుదలైనప్పటి నుండి ఈ మూవీ ప్రశంసలు అందుకుంటూ వస్తోంది. మొదట్లో తక్కువగా అంచనా వేయబడిన ఈ చిత్రం అంచనాలను అధిగమించి..2024లో అత్యధిక వసూళ్లు చేసిన తమిళ చిత్రాలలో ఒకటిగా నిలిచింది.

దాదాపు 20 కోట్ల బ‌డ్జెట్‌తో రూపొందిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద  రూ.50 కోట్లకు పైగా కలెక్షన్స్ అందుకుంది. ఈ సినిమాకు కోలీవుడ్ స్టార్ డైరెక్టర్  వెట్రిమార‌న్ క‌థ‌ను అందించగా..ఆర్ఎస్ దురై సెంథిల్‌కుమార్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు.

భైరవం కథ విషయానికి వస్తే..

డైరెక్టర్ విజయ్ కనకమేడల తమిళ మాతృక ‘గ‌రుడ‌న్’ స్టోరీని అలాగే ఉంచి, తెలుగు నెటివిటీకి తగినట్లుగా పలు మార్పులు  చేశారు. ఇదే భైరవం సినిమాకు పెద్ద ప్లస్ అయింది. ఎందుకంటే, రీమేక్ సినిమా చేయడం దర్శకులకు కత్తి మీద సాములాంటి. ఆ విషయంలో డైరెక్టర్ విజయ్ సక్సెస్ సాధించాడు. కథ, స్క్రీన్ ప్లే,‌‌ క్యారెక్టర్స్ పరంగా ఎలాంటి మార్పులు చేయకుండా ఎమోషనల్ డ్రామాను చూపించి తెలుగు ప్రేక్షుకులను మెప్పించేలా రూపొందించాడు.

సినిమా మొత్తం ముగ్గురు ప్రాణ స్నేహితులు, వారి జీవితం, గుడి మాన్యం చుట్టూనే సాగుతుంది. ఇలాంటి సినిమాలు కాస్తా రొటీన్ అనిపించినప్పటికీ హీరోలు తమ నటనతో ప్రేక్షకులు థ్రిల్ అయ్యేలా, సీట్లో కూర్చునేలా చేశారు. 

కథలోకి వెళ్తే.. అత్యంత ప్రాణ స్నేహితులుగా ఉన్న ఓ ముగ్గురు యువకులు.. ఎలాంటి కారణాల చేత విడిపోవాల్సి వచ్చిందనే అంశాలను ఎమోషనల్ గా తెరకెక్కించాడు. ఈ ముగ్గురి పాత్రల పరిచయం, వారాహి ఆలయ భూముల బ్యాక్ గ్రౌండ్, ఆ భూముల కోసం కన్నేసిన వారిని ఫస్టాఫ్ లో చూపించాడు. ఒక్కమాటలో చెప్పాలంటే సెకండాఫ్ కు ఫస్టాఫ్ మూలం అని చెప్పుకోవాలి.

ఇక సెకండాఫ్ లోనే అసలు కథ మొదలు పెట్టాడు దర్శకుడు.  ప్రాణానికి ప్రాణంగా బతికిన స్నేహితులే ఒకరినొకరు చంపుకోవాల్సిన పరిస్థితులు తలెత్తడం, నమ్మిన బంటులా ఉండే మరో స్నేహితుడు చంపడానికి కూడా సిద్దపడటం వంటి అంశాలను దర్శకుడు విజయ్ హ్యాండిల్ చేసే విధానం ఆకట్టుకుంటుంది.

సెకండాఫ్ లో సాయి శ్రీనివాస్ కు పూనకం వచ్చే ఎపిసోడ్ గూస్‌బంప్స్ తెప్పించేలా డిజైన్ చేసుకున్నాడు డైరెక్టర్. అయితే, ఇంట్రెస్టింగ్ రురల్ డ్రామాతో వచ్చిన ఈ మూవీలో పాటలు ఉండటం మైనస్ గా నిలిచింది. క్లైమాక్స్ పోర్షన్ కు ఆడియన్స్ థ్రిల్ ఫీల్ అవుతారు.

ఎవరెలా నటించారంటే:

గజపతి పాత్ర ద్వారా మనోజ్ రీ ఎంట్రీ అదిరిపోయింది. ఈ సినిమాకు ముందు.. తర్వాత అనేలా తన మనోజ్ పెర్ఫార్మన్స్ చూపించాడు. మనోజ్ ఒకడే కాదు.. ముగ్గురికి కరెక్ట్ క్యారెక్టరైజేషన్ పడింది.

తెలుగు ఇండస్ట్రీలో ముగ్గురు హీరోలను ఎంచుకుని వారికి స్క్రీన్ ప్రజెన్స్ సమతుల్యంగా ఉంచడంలో డైరెక్టర్ విజయ్ సక్సెస్ అయ్యాడు. వారిని కొత్త కోణంలో చూపించి.. భైరవం తో కమ్బ్యాక్ ఇచ్చేలా డైరెక్టర్ తీర్చిదిద్దాడు. హీరోయిన్స్ గా నటించిన అదితి శంకర్, ఆనంది, దివ్య పిళ్ళై తమ పాత్రలతో మెప్పించారు.

సాంకేతిక అంశాలు:

మ్యూజిక్ డైరెక్టర్ శ్రీ చరణ్ పాకాల BGM అదరగొట్టిండు. యాక్షన్ సీన్స్‌కు మంచి ఎలివేషన్ ఇచ్చేలా తన టాలెంట్ చూపించాడు. పాటలు విజువల్ గా చూడటానికి పర్లేదు. హరి కె వేదాంతం సినిమాటోగ్రఫీ మెచ్చుకోదగినది. ఛోటా కె ప్రసాద్ ఎడిటింగ్ బాగుంది. మాస్ ఎలిమెంట్స్ ఎక్కడా బోర్ కొట్టకుండా కత్తిరించాడు.

సత్యర్షి, తూమ్ వెంకట్ డైలాగ్స్ ఆకట్టుకుంటాయి. స్క్రీన్ పై విజిల్స్ వేయిస్తాయి. నిర్మాత కెకె రాధా మోహన్ ఎక్కడ రాజీపడకుండా ఉన్నతంగా తీర్చిదిద్దాడు. చివరగా స్క్రీన్ ప్లే, దర్శకత్వం వహించిన దర్శకుడు  విజయ్ కనకమేడల తనదైన మేకింగ్ తో ముగ్గురు హీరోలతో వచ్చి సక్సెస్ అయ్యాడు.