
మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్గా రూపొందిన చిత్రం ‘కన్నప్ప’. ఇందులో ప్రభాస్, కాజల్, అక్షయ్ కుమార్, మోహన్లాల్, శివరాజ్ కుమార్, శరత్ కుమార్ లాంటి స్టార్స్ కీలక పాత్రలు పోషించడంతో ఈ సినిమాపై అంచనాలు ఏర్పడ్డాయి. జూన్ 27న పాన్ ఇండియా వైడ్గా సినిమా విడుదల కానుంది. తాజాగా హైదరాబాద్లో ప్రీ రిలీజ్ ఈవెంట్ను నిర్వహించారు. ఈ సందర్భంగా మోహన్ బాబు మాట్లాడుతూ ‘పరమేశ్వరుడు ఇచ్చిన శక్తితోనే ఈ చిత్రాన్ని తీశాం. ఇందులోని ప్రతీ పాత్ర హీరోలానే ఉంటుంది.
తల్లీతండ్రి తప్ప మరో దైవం లేరని చెప్పేవాడు తిన్నడు. ఆ తిన్నడు కన్నప్పగా ఎలా మారాడన్నదే ఈ కథ. పెద్ద విజయం సాధిస్తుందనే నమ్మకం ఉంది’ అని అన్నారు. విష్ణు మాట్లాడుతూ ‘శివానుగ్రహంతోనే ఈ సినిమా సాధ్యమైంది. ఈ ప్రయాణం అంత సులభంగా ఏమీ జరగలేదు. ఎన్నో బాధలు పడ్డాం.
‘అసలు ఈ చిత్రాన్ని ఎందుకు తీస్తున్నావ్’ అని శివ రాజ్ కుమార్ అడిగారు. 50 ఏళ్ల తరువాత మళ్లీ మన కన్నప్ప గురించి ఈ తరానికి చెప్పాలని ఆ శివుడే నాతో ఈ మూవీని తీయించారేమో అని శివన్నతో అన్నాను. ప్రభాస్ గురించి ఎంత చెప్పినా తక్కువే. నాన్న గారి మీదున్న గౌరవంతోనే ఆయన ఇందులో నటించారు. ప్రభాస్ మానవత్వం ఎంతో గొప్పగా ఉంటుంది.
నాకు ప్రభాస్ కృష్ణుడు అయితే.. నేను మాత్రం ప్రభాస్కి కర్ణుడిని. శివుని ఆశీస్సులు, ఆడియెన్స్ ప్రేమతో ఈ చిత్రం పెద్ద విజయం సాధిస్తుందని భావిస్తున్నా’ అని చెప్పాడు. ఈ చిత్రం అందరినీ ఆకట్టుకునేలా ఉంటుందని దర్శకుడు ముఖేష్ కుమార్ సింగ్ అన్నాడు. ఇందులో నటించడం ఆనందంగా ఉందని నటీనటులు శరత్ కుమార్, బ్రహ్మానందం, మధుబాల, శివ బాలాజీ, ముఖేష్ రిషి అన్నారు.