రిచెస్ట్​ రియల్టర్​ లోధా

రిచెస్ట్​ రియల్టర్​ లోధా

ఆయన సంపద విలువ 32 వేల కోట్లు

2,3 స్థానాల్లో డీఎల్ఎఫ్, ఎంబసీ ప్రమోటర్లు

న్యూ ఢిల్లీ: ముంబైకి చెందిన లోధా డెవలపర్స్ అధినేత ఎంపీ లోధా, ఆయన కుటుంబం దేశంలోని అత్యంత ధనవంతులైన రియల్ఎస్టేట్​ ఎంటర్‌‌‌‌ప్రెన్యుర్లలో టాప్​ ర్యాంక్​ దక్కించుకున్నారు.  రూ. 31, 960 కోట్ల సంపదతో  మంగళప్రభాత్​ లోధా, ఆయన కుటుంబం వరుసగా రెండో ఏడాది కూడా టాప్​ స్థానంలో ఉంది. తర్వాత స్థానంలో  డీఎల్ఎఫ్​ అధినేత రాజీవ్​ సింగ్, మూడో స్థానంలో ఎంబసీ గ్రూప్​ ఫౌండర్​ జితేంద్ర విర్వాని నిలిచారు.   దేశంలో అత్యంత ధనవంతులైన రియల్ఎస్టేట్​ఎంటర్‌‌‌‌ప్రెన్యూర్ లిస్ట్‌‌ను  ‘గృహ్​హరున్​​ఇండియా రియల్‌‌ఎస్టేట్​ రిచ్​లిస్ట్- 2019’ పేరుతో హరున్​, గృహ్​ఇండియా సోమవారం విడుదల చేశాయి.  “రూ. 31,960 కోట్ల సంపదతో మంగళ ప్రభాత్​లోధా, ఆయన కుటుంబానికి చెందిన మాక్రోటెక్ డెవలపర్స్(ముందు ఈ కంపెనీ లోధా డెవలపర్స్‌‌గా ఉండేది), గృహ్​ హరున్​​ఇండియా రియల్‌‌ఎస్టేట్​ రిచ్​లిస్ట్ –2019 లో మొదటిస్థానాన్ని దక్కించుకుంది.  దీంతో వరుసగా రెండో ఎడిషన్‌‌లో కూడా ఎంపీ లోధా, ఆయన కుటుంబం టాప్​ పొజిషన్‌‌లో నిలిచినట్టయ్యింది. లోధా కుటుంబం సంపద 2019 లో 18 శాతం పెరిగింది” అని గృహ్​హరున్​‌‌ రిపోర్ట్‌‌లో పేర్కొంది.  “రూ. 25,080‌‌‌‌ కోట్ల సంపదతో డీఎల్‌‌ఎఫ్​ రాజివ్​సింగ్ రెండవ స్థానంలో(ఒక స్థానం పెరిగింది)  నిలిచారు. ఈయన సంపద పోయినేడాదితో పోల్చుకుంటే 2019లో 42 శాతం పెరిగింది” అని ఈ నివేదిక తెలిపింది.  ఎంబసీ ప్రాపర్టీ డెవలప్‌‌మెంట్స్​ జితేంద్ర విర్వాని రూ. 24,750 కోట్లతో, ఈ లిస్ట్​లో మూడో స్థానాన్ని పొందారు. కాగా 2019 సెప్టెంబర్​ 30 వరకు ఉన్న సంపద ఆధారంగా ఈ లిస్ట్‌‌ను హరున్​‌‌ఇండియా తయారు చేసింది.

టాప్​10 లో ఉన్న సంపన్నులు..

ఈ రిచ్​లిస్ట్‌‌లో హీర్​నందాని కమ్యూనిటీస్​ గ్రూప్ నిరంజన్​ హీర్​నందాని రూ. 17,030 కోట్ల సంపదతో నాలుగో స్థానంలో, కే రహేజా సంస్థకు చెందిన చంద్రు రహేజా, ఆయన కుటుంబం రూ. 13,910 కోట్లతో ఐదో స్థానంలో,  ఒబెరాయ్​ రియల్టీ వికాస్​ ఒబెరాయ్​ రూ.13,910 కోట్ల సంపదతో ఆరవ స్థానంలో నిలిచారు.  వీరితోపాటు బాగ్మాన్​ డెవలపర్స్​రాజా బాగ్మాన్​ రూ. 9,960 కోట్లతో ఏడవ స్థానంలో,  హౌస్​ఆఫ్ హీరానందాని సింగపూర్​ సురేంద్ర హీర్​నందాని రూ. 9,720 కోట్ల సంపదతో ఎనిమిదవ స్థానంలో, రున్వాల్​ డెవలపర్స్ సుభాష్​​రున్వాల్ అతని కుటుంబం రూ. 7,100 కోట్లతో తొమ్మిదవ స్థానంలో, పిరమల్​ రియల్టీ అజయ్​పిరమల్, అతని కుటుంబం రూ. 6,650 కోట్ల సంపదతో పదో స్థానంలో ఉన్నారు. మొత్తంగా ఈ రిచ్​లిస్ట్‌‌లోని టాప్​ 10 సంపన్నుల్లో ఆరుగురు, టాప్​100 లో 37 మంది ముంబై నుంచే ఉండడం గమనార్హం.

సంపన్నుల్లో మనవాళ్లు..

‘గృహ్ హురున్‌ ఇండియా రియల్‌ ఎస్టేట్ రిచ్ లిస్ట్-–2019 లో హైదరాబాద్ నుంచి ఎనిమిది మందికి చోటు దక్కింది. అపర్ణ కనస్ట్రక్షన్ అండ్ ఎస్టేట్ సీ వెంకటేశ్వర రెడ్డి రూ. 2,590 కోట్ల సంపదతో టాప్ 100 లో 25వ స్థానాన్ని దక్కించుకున్నారు. అదేవిధంగా రూ. 2,570 కోట్లతో అపర్ణ కనస్ట్రక్సన్‌ అండ్ ఎస్టేట్స్‌‌కు చెందిన ఎస్ సుబ్రమణ్యం రెడ్డి 27వ స్థా నంలో ఉన్నారు. విడివిడిగా మైహోం కనస్ట్రక్షన్‌ ఫ్యామిలీకి చెందిన జూపల్లి రామురావు(రూ. 740 కోట్లు), జూపల్లి రంజిత్ రావు( రూ. 740 కోట్లు),
జూపల్లి శ్యామ్ రావు(రూ. 740 కోట్లు), జూపల్లి వినోద్(రూ. 740 కోట్లు) లిస్ట్‌‌లో 52వ స్థానంలో ఉండగా, జూపల్లి రామేశ్వరరావు(రూ. 710 కోట్లు) 58వ స్థానంలో నిలిచారు. నిజానికి జూపల్లి ఫ్యామిలీ ఉమ్మడి సంపద విలువను లెక్కలోకి తీసుకుంటే స్టేట్ లో వాళ్లే టాప్ లో ఉంటారు. తాజ్ జీవీకే అధినేత జీవీకే రెడ్డి, ఆయన కుటుంబం రూ. 610 కోట్ల సంపదతో 65వ స్థానంలో ఉంది.