కాంగ్రెస్ ఎదుగుదలను కేసీఆర్ జీర్ణించుకోలేకపోతున్నడు
రేవంత్ మాటల్ని బీఆర్ఎస్ వక్రీకరిస్తున్నది : మాణిక్ రావ్ ఠాక్రే
ఢిల్లీ, వెలుగు : తెలంగాణలో కాంగ్రెస్ ఎదుగుదలను సీఎం కేసీఆర్ జీర్ణించుకోలేక పోతున్నారని కాంగ్రెస్ స్టేట్ ఇన్చార్జ్ మాణిక్ రావ్ ఠాక్రే విమర్శించారు. పార్టీ బలోపేతాన్ని చూసి కేసీఆర్ కాళ్ల కింద భూమి కదులుతున్నదని అన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ బలపడడం కేసీఆర్కు నచ్చడం లేదని ఫైర్అయ్యారు. ఒకప్పుడు కాంగ్రెస్ పేరు తీసేందుకు ఇష్టపడని కేసీఆర్, బీఆర్ఎస్ శ్రేణులు.. ఇప్పుడు ఆందోళనల పేరిట పదే పదే కాంగ్రెస్ను జపిస్తున్నారని విమర్శించారు. ‘24 గంటల ఉచిత కరెంట్’పై రేవంత్ చేసిన వ్యాఖ్యల పట్ల బుధవారం ఠాక్రే స్పందించారు. ఢిల్లీలోని మహారాష్ట్ర సదన్లో ఏఐసీసీ జనరల్ సెక్రటరీ వంశీ చంద్ రెడ్డి, తెలంగాణ సహ ఇన్చార్జ్ రోహిత్ చౌదరితో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. రేవంత్ రెడ్డి మాటల్ని బీఆర్ఎస్ వక్రీకరిస్తోందని, పూర్తిగా వింటే ఆయన చెప్పిన ఆలోచనా విధానం అర్థమవుతుందన్నారు. కాంగ్రెస్ రైతుల సంక్షేమానికి కట్టుబడి ఉందన్నారు. వరంగల్ డిక్లరేషన్ను అమలు చేస్తామని స్పష్టం చేశారు. 24 గంటల ఉచిత కరెంట్ ను ఎన్నికల మేనిఫెస్టోలో పెడతామని చెప్పారు. కాంగ్రెస్లో సీఎం అభ్యర్థులకు కొదవలేదని ఠాక్రే అన్నారు. రేవంత్, ఉత్తమ్, భట్టి, మధుయాష్కీ, కోమటిరెడ్డి, దామోదర రాజనర్సింహా, సీతక్క ఇలా ఎంతో మంది ఉన్నారన్నారు. అయితే, ఎన్నికలకు ముందే సీఎం అభ్యర్థిని ప్రకటించరని చెప్పారు. మ్యాజిక్ ఫిగర్ సాధించిన తర్వాత.. ఎమ్మెల్యేల అభిప్రాయాన్ని తీసుకొని అధిష్టానం సీఎం అభ్యర్థిని ప్రకటిస్తుందని తెలిపారు.
రైతులపై తూటాలు పేల్చిన సర్కారులో కేసీఆర్ ఉన్నడు : వంశీ చంద్ రెడ్డి
2000 ఏడాదిలో బషీర్బాగ్లో రైతులపై తూటాలు పేల్చిన టీడీపీ ప్రభుత్వంలో కేసీఆర్ కూడా భాగస్వామిగా ఉన్నారని ఏఐసీసీ సెక్రటరీ వంశీ చంద్ రెడ్డి ఆరోపించారు. తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీకి నూకలు చెల్లాయని, త్వరలో ఆ పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ప్రజా ప్రతినిధులు కాంగ్రెస్లో చేరుతారని చెప్పారు. ఇది తెలిసి బీఆర్ఎస్ భయపడుతోందని, సొంత ఇంటిని కాపాడుకోలేని కేసీఆర్ కాంగ్రెస్పై అసత్య ప్రచారాలు చేస్తున్నారని విమర్శించారు.