గచ్చిబౌలి డ్రగ్స్ కేసులో మంజీర గ్రూప్ డైరెక్టర్ అరెస్ట్

గచ్చిబౌలి డ్రగ్స్ కేసులో మంజీర గ్రూప్ డైరెక్టర్ అరెస్ట్

హైదరాబాద్ లో మరోసారి డ్రగ్స్ కలకలం రేగింది. గచ్చిబౌలి డ్రగ్స్ కేసులో మంజీర గ్రూప్ డైరెక్టర్ జి. వివేకానందని పోలీసులు అరెస్ట్ చేశారు. అతనితో పాటు మరో ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సైబరాబాద్ సీపీ అవినాష్ మహంతి తెలిపిన వివరాల ప్రకారం..

గచ్చిబౌలి రాడిసన్ హోటల్ లో  పార్టీ జరిగినట్లు పోలీసులకు సమాచారం అందింది. దీంతో  ఏస్ఓటీ పోలీసులు 2024 ఫిబ్రవరి 26 సోమవారం సోదాలు చేశారని సైబరాబాద్ సీపీ అవినాష్ మహంతి తెలిపారు. ఈ తనిఖీల్లో కొకైన్ స్వాధీనం చేసుకున్నారు. ఈ వ్యవహారంలో మంజీర గ్రూప్ డైరెక్టర్  జి. వివేకానంద.. అతనితో పాటు నిర్భయ్, కేదార్ లను కూడా అరెస్ట్ చేశామన్నారు. ఈ ముగ్గురు కొకైన్ తీసుకున్నట్లు వైద్య పరీక్షల్లో తేలిందని వివరించారు. ఇందులో భాగంగా హోటల్ పై కూడా కేసు నమోదు చేస్తామని వెల్లడించారు.

హోటల్ కి వచ్చిన వారికి అబ్బాస్ అనే వ్యక్తి డ్రగ్స్ అమ్మినట్లు  విచారణలో తేలిందని.. అతని కోసం గాలిస్తున్నామని తెలిపారు. నిందితుల ఫోన్ లు కూడా స్వాధీనం చేసుకున్నామని.. కానీ వారంతా ఫోన్ లోని డేటాని డిలీట్ చేశారని చెప్పారు. ఫోన్ రీట్రైవ్ చేసేందుకు ప్రయత్నిస్తున్నామని సీపీ అవినాష్ తెలిపారు.