![జోనల్, డిప్యూటీ కమిషనర్ల బదిలీలు.. కొందరికి పదోన్నతి.. మరికొందరికి రిలీవ్](https://static.v6velugu.com/uploads/2023/07/deputy-commissioners-of-GHMC_X59PoSf3a8.jpg)
హైదరాబాద్, వెలుగు: జీహెచ్ఎంసీలోని పలువురు జోనల్ కమిషనర్లు, ఇద్దరు డిప్యూటీ కమిషనర్లు బదిలీ అయ్యారు. ఈ మేరకు ఎంఏయూడీ స్పెషల్ చీఫ్ సెక్రటరీ అర్వింద్ కుమార్ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఎన్నికల నేపథ్యంలో చాలా రోజులుగా ఒకేచోట పనిచేస్తున్న అధికారులను ఇతర జోన్లకు, సర్కిళ్లకు బదిలీ చేశారు. సికింద్రాబాద్ జోన్ కమిషనర్ గా పనిచేస్తున్న శ్రీనివాస్ రెడ్డిని శేరిలింగంపల్లి జోనల్ కమిషనర్ గా, అక్కడ పనిచేస్తున్న శంకరయ్యను ఎలక్షన్స్ అడిషనల్ కమిషనర్గా నియమించారు. ఎల్బీనగర్ జోనల్ కమిషనర్, ఎలక్షన్స్అడిషనల్ కమిషనర్ గా ఉన్న పంకజను ఎలక్షన్స్అడిషనల్ కమిషనర్ బాధ్యతల నుంచి రిలీవ్ చేశారు.
ఖైరతాబాద్ జోనల్ కమిషనర్ రవికిరణ్ను సికింద్రాబాద్కు బదిలీ చేసి, ఖైరతాబాద్ జోన్ ను అదనపు బాధ్యతలు కింద అప్పగించారు. చార్మినార్ జోనల్ కమిషనర్గా ఉన్న అశోక్ సామ్రాట్ను సీడీఎంఏ జాయింట్ డైరెక్టర్గా, సీడీఎంఏలో జాయింట్ డైరక్టర్ గా పనిచేస్తున్న ఉపేందర్ రెడ్డిని శానిటేషన్ అడిషనల్ కమిషనర్గా నియమించారు. శానిటేషన్ ఇన్చార్జి అడిషనల్ కమిషనర్ గా ఉన్న మమత(కూకట్ పల్లి జోనల్ కమిషనర్ )ను ఆ బాధ్యతల నుంచి రిలీవ్ చేశారు. శేరిలింగంపల్లి డిప్యూటీ కమిషనర్ వెంకన్నకు పదోన్నతి కల్పిస్తూ.. చార్మినార్ జోనల్ కమిషనర్గా నియమించారు. శేరిలింగంపల్లి డిప్యూటీ కమిషనర్ సుధాంశ్కు చందానగర్ డీసీగా పూర్తి అదనపు బాధ్యతలు అప్పగించారు. త్వరలో మరిన్ని బదిలీలు జరగనున్నాయని తెలుస్తోంది.