మందుపాతర పేల్చిన మావోయిస్టులు.. చత్తీస్​గఢ్​లో జవాన్​ మృతి

మందుపాతర పేల్చిన మావోయిస్టులు.. చత్తీస్​గఢ్​లో జవాన్​ మృతి
  • నారాయణ్​పూర్​ జిల్లా చోటే డాంగేర్​ పీఎస్ ​పరిధిలో ఘటన  

భద్రాచలం,వెలుగు :  చత్తీస్​గఢ్​లో మావోయిస్టులు బుధవారం దారి కాచి (అంబుష్​) పెట్రోలింగ్​చేస్తున్న సీఏఎఫ్ ​జవాన్​ను  మందుపాతర పేల్చి చంపారు. నారాయణ్​పూర్ ​జిల్లా ఎస్పీ పుష్కర్​శర్మ కథనం ప్రకారం...చత్తీస్​గఢ్​ 9వ బెటాలియన్​ సీఏఎఫ్​(చత్తీస్​గఢ్​ ఆర్ముడ్ ​ఫోర్స్)కు చెందిన జవాన్లు చోటే డాంగేర్​ పోలీస్​స్టేషన్​ పరిధిలో పెట్రోలింగ్​కు వెళ్లారు. నెకో ఇండస్ట్రీస్​కు చెందిన ఆమ్దాయి ఐరన్​ గనుల వద్ద వీరి రాకను గమనించిన మావోయిస్టులు రోడ్డుపై అంతకుముందే మందుపాతర అమర్చి వేచి చూస్తున్నారు.

కూంబింగ్​ చేసుకుంటూ అతి సమీపంలోకి రాగానే మందుపాతర పేల్చారు. ఈ ఘటనలో ముందు వరుసలో ఉన్న కమలేష్​ సాహూ​ అనే జవాన్​ తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే చనిపోయాడు. వినయ్​కుమార్ ​అనే మరో కానిస్టేబుల్​ స్వల్ప గాయాలతో బయటపడ్డారు. అతన్ని జగదల్​పూర్​ దవాఖానకు తరలించారు. పారిపోయిన మావోయిస్టుల కోసం గాలిస్తున్నట్టు ఎస్పీ పుష్కర్​ శర్మ తెలిపారు.