
- ఈ నెల 2న రహస్యంగా జీవో జారీ చేసిన సర్కారు
- సాఫ్ట్వేర్ జాబ్ వదిలేసి, బీఆర్ఎస్ స్కీమ్లకు ఆకర్షితుడై పార్టీలో చేరినట్టు కలరింగ్
- సర్కారు సొమ్ముతో మహారాష్ట్రలో ప్రచారకర్తను నియమించుకున్నట్లు ఆరోపణలు
- ఇలాంటి పదవులే ఇంకొందరికి ఇచ్చారా? అని సందేహాలు
- సొంత పార్టీ విస్తరణకు ప్రజల సొమ్మును దోచిపెట్టడమేంటని ప్రతిపక్షాల ప్రశ్నలు
హైదరాబాద్, వెలుగు: తెలంగాణ ముఖ్యమంత్రి కార్యాలయం (సీఎంవో)లో మహారాష్ట్ర బీఆర్ఎస్ లీడర్కు కొలువు ఇచ్చారు. నెలకు రూ.1.50 లక్షల జీతంతో సీఎం కేసీఆర్కు ప్రైవేట్సెక్రటరీగా నియమించారు. తెలంగాణలో బీఆర్ఎస్ సర్కారు అమలు చేస్తున్న కార్యక్రమాలకు ఆకర్షితుడై, సాఫ్ట్వేర్ జాబ్ వదిలేసి ఓ యువకుడు పార్టీలో చేరాడంటూ సొంత మీడియాలో ప్రచారం చేసుకున్నారు. తీరా చూస్తే తెలంగాణ సీఎం ప్రైవేట్ సెక్రటరీగా మర్కద్ శరద్ బాబాసాహెబ్ అనే వ్యక్తి నియమితుడైనట్లు, ఈ నెల ఒకటో తేదీ నుంచి ఆయన నియామకం అమల్లోకి వస్తున్నట్టు రెండో తేదీన జీవో ఆర్టీ నం.647 జారీ చేశారు. రెండేండ్లపాటు ఆయన సీఎం పీఎస్గా కొనసాగుతారని, ఇందుకు నెలకు రూ.1.50 లక్షల చొప్పున ఫిక్స్డ్ రెమ్యునరేషన్ చెల్లిస్తామని ఉత్తర్వుల్లో తెలిపారు. జీఏడీ రెగ్యులర్ బడ్జెట్ నుంచి వేతనం చెల్లించాలని పేర్కొన్నారు. మహారాష్ట్రలో గులాబీ పార్టీకి పని, ప్రచారం చేసేందుకు మర్కద్కు పదవి ఇచ్చి సర్కారు సొమ్ముతో జీతం చెల్లించడం, ఈ జీవోను పబ్లిక్ డొమైన్లో పెట్టకుండా దాచిపెట్టడం వివాదాస్పదమవుతున్నది.
టీఆర్ఎస్ పేరును బీఆర్ఎస్గా మార్చిన కేసీఆర్.. దేశ రాజకీయాల్లో చక్రం తిప్పాలని భావిస్తున్నారు. నిజానికి 2017 నుంచి జాతీయ రాజకీయాల్లోకి వెళ్లాలని ఆయన ప్రయత్నిస్తున్నా కలిసిరావడం లేదు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన తర్వాత జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో ‘‘సారు.. కారు.. 16.. ఢిల్లీలో మనం చెప్పినోళ్ల సర్కారు” నినాదంతో పోటీ చేసినా సక్సెస్ కాలేదు. తర్వాత కూడా నేషనల్పాలిటిక్స్లో కింగ్పిన్ కావాలనే ప్రయత్నాలను కేసీఆర్ కొనసాగిస్తూనే ఉన్నారు. ఈ క్రమంలో పార్టీ పేరులో ‘తెలంగాణ’ తీసేసి ‘భారత’ రాష్ట్ర సమితిగా మార్చేశారు. ఏపీ, కర్నాటకలో పార్టీ విస్తరణకు ప్రయత్నించి.. అక్కడ వర్కవుట్కాకపోవడంతో మహారాష్ట్రపై ఫోకస్ పెట్టారు. ఇతర పార్టీల నుంచి మాజీ ఎమ్మెల్యేలు, ఇతర లీడర్లను చేర్చుకుంటూ అక్కడి స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలవాలని ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో మర్కద్ అనే వ్యక్తి సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఉద్యోగాన్ని వదిలేసి బీఆర్ఎస్లో చేరాడంటూ సొంత మీడియాలో ప్రచారం చేసుకున్నారు. సీన్కట్ చేస్తే సదరు మర్కద్ను తీసుకొచ్చి సీఎంవోలో కూర్చోబెట్టారు. ఈ యువకుడిని తెలంగాణ సీఎంవోలో వ్యవహారాలు చక్కబెట్టేందుకు నియమించలేదని, మహారాష్ట్రలో రాజకీయాలు చేయించడానికి, అందుకు ఆయనకో సర్కారీ వాహనం, ఇతర సౌకర్యాలు, అలవెన్సులు, అధికారాలతో కూడిన ఉద్యోగమిచ్చారని సెక్రటేరియట్ వర్గాలే చెప్తున్నాయి.
ఇక్కడి సొమ్ముతో అక్కడ పని చేసేలా!
మహారాష్ట్రలో సులభంగా ప్రజల్లోకి వెళ్లలేమని గుర్తించిన కేసీఆర్.. సర్కారు సొమ్ముతో అక్కడో ప్రచారకర్తను నియమించారనే ఆరోపణలున్నాయి. జిల్లా పరిషత్ ఎన్నికలే టార్గెట్గా తెలంగాణ పథకాలను అక్కడ ప్రచారం చేయడానికి శరద్ను ఎంచుకున్నారనే ప్రచారం సాగుతోంది. సర్కారు సొమ్ముతో అక్కడ గులాబీ పార్టీకి ఆయన పని చేయనున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. మహారాష్ట్రలో పట్టు సాధించే ప్లాన్లో భాగంగా.. శ్రీరాంసాగర్ ప్రాజెక్టు నీళ్లను లిఫ్ట్ చేసుకోవాలని ఇదివరకే కేసీఆర్ సలహా ఇచ్చారు. ఇప్పుడు తెలంగాణ ప్రజల సొమ్ముతో జీతమిచ్చి అక్కడ పార్టీ పనులు చక్కబెట్టేందుకు ఒకరికి ప్రైవేట్ సెక్రటరీ పదవి ఇచ్చారని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. జీవోలన్నీ ప్రభుత్వం రహస్యంగా ఉంచుతుండటంతో ఒక్క మర్కద్కు మాత్రమే పదవి ఇచ్చారా.. ఇలాంటి పదవులే ఇంకొందరికి ఇచ్చి ఉంటారా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. సొంత పార్టీ విస్తరణకు ప్రజల సొమ్మును దోచిపెట్టడం ఏమిటని ప్రతిపక్ష నేతలు, ప్రజాస్వామికవాదులు ప్రశ్నిస్తున్నారు.