- క్రూడాయిల్ ధర పెరగడమే కారణం
ముంబై: వరుసగా రెండో రోజు భారత స్టాక్ మార్కెట్లు నష్టాల్లో ముగిశాయి. సెన్సెక్స్ గురువారం 852 పాయింట్లు కుప్పకూలి 77,664 వద్ద స్థిరపడింది. ఇంట్రాడేలో 942 పాయింట్లు పడిపోయి 77,574 వరకు చేరింది. నిఫ్టీ కూడా 205 పాయింట్లు తగ్గి 24,173 వద్ద ముగిసింది. ఇరాన్–అమెరికా చర్చలు నిలిచిపోవడంతో క్రూడ్ ఆయిల్ ధర మళ్లీ బ్యారెల్కు 100 డాలర్లు దాటింది.
బ్రెంట్ క్రూడ్ గురువారం 1.89శాతం పెరిగి 103.8 డాలర్ల వద్ద ట్రేడ్ అయ్యింది. దీనికి తోడు విదేశీ పెట్టుబడిదారుల అమ్మకాలు, ఆసియా–యూరప్ మార్కెట్లు నష్టాల్లో కదలడంతో మన మార్కెట్ పడుతోంది. సెన్సెక్స్లో ట్రెంట్, బజాజ్ ఫిన్సర్వ్, టెక్ మహీంద్రా, ఇన్ఫోసిస్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ వంటి షేర్లు గురువారం నష్టాల్లో ముగియగా, అదానీ పోర్ట్స్, ఎల్ అండ్ టీ, సన్ ఫార్మా, ఎయిర్టెల్, భారతీ ఎలక్ట్రానిక్స్ లాభాల్లో క్లోజయ్యాయి. రంగాల వారీగా చూస్తే, పీఎస్యూ బ్యాంక్, ఆటో, రియల్టీ, కన్జూమర్ డ్యూరబుల్స్ ఎక్కువగా పడ్డాయి. హెల్త్కేర్, క్యాపిటల్ గూడ్స్, పవర్ మాత్రం లాభాల్లో నిలిచాయి.
రూపాయి @ 94.01..
డాలర్తో రూపాయి విలువ వరుసగా నాలుగో రోజూ క్షీణించింది. గురువారం 23 పైసలు తగ్గి 94.01 వద్ద ముగిసింది. హార్మూజ్ జలసంధి అంతరాయాలు, పెరిగిన క్రూడ్ ధరలు, విదేశీ పెట్టుబడులు వెళ్లిపోతుండడంతో రూపాయి విలువ పడుతోంది. ఫారిన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్లు బుధవారం నికరంగా రూ.రెండు వేల కోట్ల షేర్లను అమ్మగా, గురువారం మరో రూ.3,250 కోట్ల విలువైన షేర్లను అమ్మారు.

