
హైదరాబాద్ : కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన మర్రి చెన్నారెడ్డి కుమారుడు మర్రి శశిధర్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం పార్టీ ఉన్న పరిస్థితుల్లో తాను కఠినమైన నిర్ణయం తీసుకోక తప్పలేదన్నారు. కాంగ్రెస్ పరిస్థితి దిగజారిపోయిందన్నారు. ప్రజల ఆకాంక్షల మేరకు పోరాటం చేయలేకపోతోందని చెప్పారు. తెలంగాణ ఫస్ట్ అనే అభిప్రాయంతో తాను రాజీనామా నిర్ణయం తీసుకున్నానని, చాలా బాధతో కాంగ్రెస్ పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నానని చెప్పారు. ఈ రోజుతో కాంగ్రెస్ తో తనకు ఉన్న అనుబంధాన్ని తెంచుకుంటున్నానని ఆవేదనతో చెప్పారు. తాను రాజీనామా ఎందుకు చేయాల్సి వచ్చిందో సోనియాగాంధీకి లేఖలో వివరించానని అన్నారు.
పీసీసీ చీఫ్ లకు ఏజెంట్స్ లా రాష్ట్ర ఇన్ చార్జులు
చేతి గుర్తును ఎంపిక చేయడంలో తమ తండ్రి మర్రి చెన్నారెడ్డి పాత్ర చాలా ఉందని శశిధర్ రెడ్డి చెప్పారు. కాంగ్రెస్ ను అధికారంలోకి తీసుకురావడంలో తమ తండ్రి పాత్ర ఉందన్నారు. రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీతో కాంగ్రెస్ మ్యాచ్ ఫిక్సింగ్ అయిందనే భావన ప్రజల్లోకి బలంగా వెళ్లిపోయిందని చెప్పారు. రాష్ట్ర ఇన్ చార్జులు పీసీసీ చీఫ్ లకు ఏజెంట్స్ లా మారిపోయారని ఆరోపించారు. ప్రస్తుతం పీసీసీ అధ్యక్షులు బంగారు బాతు గుడ్డులా మారిపోయారని అన్నారు. రాష్ట్రంలోని పార్టీ పరిస్థితుల గురించి తాను చాలాసార్లు అధిష్టానానికి లేఖలు రాశానని, ఈ విషయంపై సోనియాగాంధీ కూడా స్పందించారని చెప్పారు. అయితే.. సోనియా కూడా ఇప్పుడున్న పరిస్థితుల్లో నిస్సహాయురాలిగా ఉన్నారని చెప్పారు. కాంగ్రెస్ పార్టీలో డబ్బు ఉన్నవాళ్లదే మాట చెల్లుతుందన్నారు. గతంలో ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా పీసీసీ అధ్యక్షుడిగా రాజీనామా చేయకుండా డ్రామాలు ఆడారని ఆరోపించారు. కాంగ్రెస్ లో గెలిచిన వాళ్లు పార్టీలో ఉంటారో లేదో అన్న అలోచన ప్రజల్లో నాటుకుపోయిందన్నారు. మరోవైపు తెలంగాణ రాష్ట్ర మాజీ గవర్నర్ నరసింహన్ పైనా మర్రి శశిధర్ రెడ్డి తీవ్ర ఆరోపణలు చేశారు.
ఉత్తమ్, రేవంత్ రెడ్డిపై మాటల దాడి
టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్ ప్రజా సమస్యలపై పోరాటం చేయలేదని మర్రి శశిధర్ రెడ్డి అన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వంతో కాంగ్రెస్ మ్యాచ్ ఫిక్సింగ్ అయ్యిందన్నారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి పీసీసీ చీఫ్ గా ఉన్నప్పటి నుంచి అన్ని ఎన్నికల్లోనూ కాంగ్రెస్ పార్టీ ఓడిపోతున్నా.. ఆయన్ను ఎందుకు ఆరేళ్లు అధ్యక్షులుగా కొనసాగించారని ప్రశ్నించారు. తెలంగాణ రాష్ట్రానికి ఇన్ చార్జులుగా ఉన్న వ్యక్తులు హైకమాండ్ కు ప్రతినిధిగా వ్యవహరించలేదన్నారు. పార్టీలోని లోటుపాట్లను సరిదిద్దలేదన్నారు. ఇన్ చార్జులకు పీసీసీ చీఫ్ బంగారు గుడ్లు పెట్టే బాతులుగా మారిపోయారని చెప్పారు. తాను కాంగ్రెస్ పార్టీలో ఇంత దౌర్భాగ్య పరిస్థితి ఎప్పుడూ చూడలేదన్నారు. పార్టీలో డబ్బు ప్రభావం బాగా పెరిగిపోయిందని చెప్పారు.
రేవంత్ రెడ్డి హైప్ క్రియేట్ చేసుకున్నారు
2018లో తనకు ఏ సర్వే ప్రకారం ఎమ్మెల్యే టిక్కెట్ ఇవ్వలేదని మర్రి శశిధర్ రెడ్డి ప్రశ్నించారు. టీడీపీ ఎమ్మెల్యేగా తలసాని శ్రీనివాస్ యాదవ్ గెలిచిన తర్వాత టీఆర్ఎస్ లో చేరి రాజీనామా చేయకుండానే ప్రమాణం స్వీకారరం చేసినప్పడు అనాడే కాంగ్రెస్ పార్టీ ఎందుకు నిరసన తెలపలేదని ప్రశ్నించారు. అప్పడే రాష్ట్ర ప్రభుత్వంపై కాంగ్రెస్ నాయకులు సీరియస్ గా పోరాటం చేసి ఉంటే.. ఇప్పుడు పార్టీకి ఈ దుస్థితి ఉండేది కాదన్నారు. పీసీసీ చీఫ్ ఎంపిక విషయంలోనూ అధిష్టానం పెద్దలు రాష్ట్రంలోని ముఖ్యమైన నాయకులను సంప్రదించలేదన్నారు. రేవంత్ రెడ్డి.. పీసీసీ చీఫ్ గా బాధ్యతలు చేపట్టిన తర్వాత హైప్ క్రియేట్ చేసుకున్నాడని ఆరోపించారు. రాష్ట్ర పరిస్థితులు మాణిక్కం ఠాగూర్ కు తెలియవన్నారు.
మునుగోడు నుంచే కాంగ్రెస్ పతనం ప్రారంభం
కోకాపేట భూముల విషయం ఏమైందని మర్రి శశిధర్ రెడ్డి ప్రశ్నించారు. రేవంత్ రెడ్డి బ్లాక్ మెయిలర్ అనే పేరు జనాల్లో ఉందని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీలో కేసీ వేణుగోపాల్ ద్రోహిలా మిగిలిపోతాడని వ్యాఖ్యానించారు. మునుగోడు ఉప ఎన్నికలో వచ్చిన ఓట్లతో తాను సంతృప్తి చెందానని రేవంత్ అన్నారని చెప్పారు. మునుగోడు నుంచే కాంగ్రెస్ పార్టీ పతనం ప్రారంభమైందని చెప్పారు. రేవంత్ రెడ్డి.. బ్లాక్ మెయిల్ రాజకీయాలకు మాత్రమే పని చేస్తారని ఆరోపిచారు. బంగారు బాతు గుడ్డు పెట్టే రేవంత్ రెడ్డిని ఠాగుర్ కాపాడుకుంటున్నారని చెప్పారు. రాష్ట్రానికి ఇప్పుడున్న ఇన్ చార్జ్ ఠాగూర్ మరో ద్రోహి అంటూ మండిపడ్డారు.
రాహుల్ వ్యాఖ్యలు బాధ కల్గించాయి
అవినీతిపై మాట్లాడే అర్హతను కాంగ్రెస్ పార్టీ కోల్పోయిందని మర్రి శశిధర్ రెడ్డి అన్నారు. ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిని హోంగార్డు అని సంబోధించడం వల్ల.. కాంగ్రెస్ పార్టీలో ఉన్న వారంతా హోంగార్డ్స్.. రేవంత్ మాత్రమే ఐపీఎస్ అధికారా..? అని ప్రశ్నించారు. ఇవాళ హోంగార్డ్ పదవి నుండి తాను తప్పుకుంటున్నందుకు చాలా సంతోషంగా ఉందన్నారు. గీత దాటితే సీనియర్ నాయకులపైనా చర్యలు తీసుకుంటామని రాహుల్ గాంధీ మాట్లాడడం తనకు బాధ కల్గించిందన్నారు. పార్టీలో తాను చాలా సీనియర్ నాయకుడని చెప్పారు. ఏదైనా అంశంపై కాంగ్రెస్ పార్టీ ఇవాళ మాట్లాడితే ప్రజలు నమ్ముతారా..? అని ప్రశ్నించారు.