న్యూఢిల్లీ: ఇండియాలో అతిపెద్ద కార్ల తయారీ కంపెనీ మారుతి సుజుకి వినియోగదారులకు మరోసారి షాక్ ఇచ్చింది. ముడిసరుకుల ఖర్చులు పెరగడంతో ఎంపిక చేసిన కొన్ని మోడళ్ల ధరలను రూ.20 వేల వరకు పెంచుతున్నట్లు ప్రకటించింది. ఈ సవరించిన ధరలు వెంటనే అమల్లోకి వచ్చాయి. ఈ ఏడాది మే తర్వాత కంపెనీ ధరలను పెంచడం ఇది వరుసగా మూడోసారి. గత రెండు సార్లు అన్ని మోడళ్లపై ధరలను పెంచగా, ఈసారి మాత్రం కొన్ని మోడళ్లకే ఈ పెంపును పరిమితం చేసింది.
కానీ, ఏయే మోడళ్లపై ఎంత మొత్తం ధర పెంచిందో అధికారికంగా మోడల్ వారీ పూర్తి జాబితాను విడుదల చేయలేదు. పెరిగిన ముడిసరుకుల ఖర్చులను గత కొన్ని నెలలుగా కంపెనీనే భరిస్తూ వచ్చిందని మారుతి రెగ్యులేటరీ ఫైలింగ్లో పేర్కొంది. అయితే అంచనాలకు మించి ఖర్చులు పెరగడంతో అనివార్య పరిస్థితుల్లో ధరలు పెంచాల్సి వచ్చిందని తెలిపింది. వినియోగదారులపై భారం తక్కువగా ఉండేలా చూసుకుంటూనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది.
