అహ్మదాబాద్: ప్రపంచ ఆర్చరీ పారా సిరీస్ మూడో అంచె పోటీల్లో ఇండియా పతకాల వేట కొనసాగిస్తోంది. విమెన్స్ కాంపౌండ్ వ్యక్తిగత విభాగంలో ప్రపంచ చాంపియన్ శీతల్ దేవి ఫైనల్లోకి దూసుకెళ్లింది. సోమవారం జరిగిన సెమీస్లో శీతల్ 145–143తో ఇండియాకే చెందిన సరితపై విజయం సాధించింది. హోరాహోరీగా సాగిన మ్యాచ్లో శీతల్ అద్భుతమైన గురితో ఆకట్టుకుంది.
స్వర్ణ పతక పోరులో శీత్.. ఐజాదా సెయిదాన్ (కజకిస్తాన్)తో తలపడనుండగా, బ్రాంజ్ మెడల్ ప్లే ఆఫ్ మ్యాచ్లో సరిత.. వాంగ్ హుయిటింగ్ (చైనా)ను ఎదుర్కోనుంది. మెన్స్ కాంపౌండ్ సెమీస్లో వరల్డ్ నంబర్వన్ టోమన్ కుమార్ 144–146తో కెన్ స్వాగుమిలాంగ్ (ఇండోనేసియా) చేతిలో ఓడాడు.
కాంస్య పతక పోరులో టోమన్.. అబ్బాస్ కాదిమ్ (ఇరాక్)తో తలపడతాడు. క్వార్టర్స్లో గుర్విందర్ సింగ్ 141–146తో స్వాగుమిలాంగ్ చేతిలో పరాజయం చవిచూశాడు. డబ్ల్యూ–1 విమెన్స్ సెక్షన్లో రెండోసీడ్ స్వాతి చౌదరి 1–7తో లియు జింగ్ (చైనా) చేతిలో ఓడి కాంస్య పోరులో నిలిచింది.
