ముంబై: ఇండియాలో బ్యాటరీ ఇండస్ట్రీ 2029–30 నాటికి 15 లక్షల నుంచి 20 లక్షల ఉద్యోగాలను ఇవ్వగలుగుతుందని టాలెంట్ సొల్యూషన్స్ సంస్థ అడెక్కో ఇండియా అంచనా వేసింది. కేవలం విదేశీ విడిభాగాల దిగుమతి, అసెంబ్లింగ్కే పరిమితం కాకుండా.. ప్రస్తుతం దేశీయంగా సెల్ తయారీ నుంచి బ్యాటరీ రీసైక్లింగ్ వరకు పూర్తిస్థాయి ఎకోసిస్టమ్ డెవలప్ అవుతోందని తెలిపింది. దీంతో భారీగా ఉపాధి అవకాశాలు ఏర్పడనున్నాయని అంచనావేసింది. ఈ సంస్థ రిపోర్ట్ ప్రకారం, ఈ ఉద్యోగాల్లో 25 శాతం ప్రత్యక్షంగా, 75 శాతం పరోక్షంగా ఉంటాయి.
ఏటా నియామకాలు 25-–30 శాతం మేర పెరుగుతాయి. ఈ ఏడాది చివరి నాటికి దేశీయ బ్యాటరీ తయారీ సామర్థ్యం 100 గిగావాట్ అవర్కు చేరుకోనుండగా, ప్రభుత్వం రూ.18,100 కోట్లతో పీఎల్ఐ పథకాన్ని అమలు చేస్తోంది. మొత్తం ఉద్యోగాల్లో కర్ణాటక అత్యధికంగా 24 శాతం, గుజరాత్ 22 శాతం, తెలంగాణ 18 శాతం, హర్యానా 14 శాతం వాటాను దక్కించుకోనున్నాయి. ఎలక్ట్రో కెమిస్ట్రీ, మెటీరియల్స్ సైన్స్, రీసైక్లింగ్ విభాగాల్లో నిపుణులకు ఇతర తయారీ రంగాల కంటే 40 శాతం ఎక్కువ జీతం లభించనుందని రిపోర్ట్ తెలిపింది.
