అన్నం మిగిలిపోతే.. కూర చెయ్యడానికి కుదరకపోతే.. ఆఫీస్ కి టైం అయిపోతుంటే.. హైరాన పడకుండా... సింపుల్ గా ఇలా చేసుకోవచ్చు.. వేడి వేడి అన్నాన్ని .. మసాల రైస్ చేసి రైతాతో తినొచ్చు... కూరల్లో తీసిపారేసే కరివేపాకుతో ఘుమఘుమలాడే కరివేపాకు అన్నం.. చేసి పిల్లల లంచ్ బాక్సుల్లో పెడితే వెరైటీ ఫుడ్ తిని ఎంతో హ్యాపీ ఫీలవుతారు. ఇప్పుడు వాటిని ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం.. . . !
మసాలా రైస్ తయారీకి కావలసినవి
- బియ్యం :రెండు కప్పులు
- ఉల్లిపాయ ముక్కలు: ఒక కప్పు (చిన్నవిగా తరిగినవి)
- ఆవాలు: ఒక టీ స్పూన్
- బిర్యానీ ఆకులు: రెండు
- యాలకులు : రెండు
- ధనియాలు : రెండు టేబుల్ స్పూన్లు
- మిరియాలు: పావు టీ స్పూన్
- జీలకర్ర: రెండు టీ స్పూన్లు
- దాల్చిన చెక్క : రెండు (చిన్నవి)
- లవంగాలు : ఐదు
- మరాఠీ మొగ్గ : ఒకటి
- ఎండు మిర్చి : రెండు
- ఎండు కొబ్బరి ముక్కలు : రెండు టేబుల్ స్పూన్లు
- పచ్చిమిర్చి: మూడు (సన్నగా తరిగినవి)
- ఉల్లిపాయ ముక్కలు: అర కప్పు
- టొమాటో ముక్కలు: ఒక కప్పు (చిన్నగా తరిగినవి)
- ఆలూ ముక్కలు : అర కప్పు (చిన్నగా తరిగినవి)
- పసుపు : పావు టీ స్పూన్
- అల్లం వెల్లుల్లి పేస్ట్ : పావు టీ స్పూన్
- నూనె: రెండు టేబుల్ స్పూన్లు
- నెయ్యి : రెండు టేబుల్ స్పూన్లు
- ఉప్పు: అర టేబుల్ స్పూన్
- కారం: ఒక టేబుల్ స్పూన్
- కొత్తిమీర తరుగు : రెండు టేబుల్ స్పూన్లు
- పుదీనా తరుగు : రెండు టేబుల్ స్పూన్లు
మసాలా రైస్ తయారీ విధానం
బియ్యాన్ని అరగంట ముందు నానబెట్టాలి తర్వాత స్టవ్ పై పాన్ పెట్టి నూనె వెయ్యకుండా ధనియాలు, ఒక స్పూన్ జీలకర్ర, దాల్చిన చెక్క, లవంగాలు, యాలకులు, మరాఠీ మొగ్గ రెండు నిమిషాలు వేగించి తర్వాత మిక్సీ పట్టాలి.
ఒక వెడల్పయిన బాండీ స్టవ్ పై పెట్టి నెయ్యి, నూనె వేసి వేడి చెయ్యాలి.. దానిలో ఆవాలు, జీలకర్ర, బిర్యానీ ఆకు, పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేగించాలి.
తర్వాత ఆలూ ముక్కలు, టొమాటో ముక్కలు, పసుపు, ఉప్పు వేసి మూత పెట్టి ఐదు నిమిషాలు మగ్గ నివ్వాలి.
తర్వాత మిక్సీ పట్టిన మసాల పొడి,నానబెట్టిన బియ్యం వేసి బాగా కలపాలి. రెండు నిమిషాలు అవి వేగాక నాలుగు కప్పుల నీళ్లు పోసి మూత పెట్టి పదినిమిషాలు ఉడకబెట్టి మూత తీసి ఒకసారి కలపాలి.
తర్వాత కలుపుతూ మరో పది నిమిషాలు ఉడికించి కొత్తిమీర, పుదీనా తరుగు వెయ్యాలి. అవి వేసాక రెండు నిమిషాలు ఉడికిస్తే వేడి వేడి 'మసాలా అన్నం రెడీ. రైతాతో తింటే సూపర్ గా ఉంటుంది.
కరివేపాకు రైస్ తయారీకి కావలసినవి
- అన్నం: ఒక కప్పు
- కరివేపాకు : ఒక కప్పు
- పల్లీలు: మూడు టేబుల్ స్పూన్లు
- అల్లం తరుగు: ఒక టీస్పూన్
- పచ్చిశనగ పప్పు రెండు టేబుల్ స్పూన్లు
- మినపప్పు: రెండు టేబుల్ స్పూన్లు
- ధనియాలు ఒక టేబుల్ స్పూన్
- జీలకర్ర: ఒక టేబుల్ స్పూన్
- ఎండుమిర్చి: ఆరు
- పచ్చిమిర్చి: ఆరు సన్నగా తరిగినవి)
- చింతపండు: చిన్న నిమ్మకాయ సైజు
- నువ్వులు ఒక టేబుల్ స్పూన్
- జీడిపప్పు : రెండు టేబుల్ స్పూన్లు
- పసుపు : పావు టీ స్పూన్
- నూనె: తగినంత
- ఉప్పు :తగినంత
కరివేపాకు రైస్ తయారీ విధానం
స్టవ్ పై పాన్ పెట్టి ఒక స్పూన్ నూనె వేసి వేడి చెయ్యాలి. దానిలో అల్లం ముక్కలు, కొద్దిగా పల్లీలు, అర స్పూన్ శెనగపప్పు, అర స్పూన్ మి నపప్పు, ధనియాలు, ఎండుమిర్చి, జీలకర్ర వేసి అవి కొద్ది సేపు వేగాక చింతపండు, నువ్వులు చేసి వేగించాలి.
తర్వాత కరివేపాకు, పచ్చిమిర్చి వేసి ఒక నిముషం పాటు వేగించాలి. అవి కొంచెం పచ్చిగా ఉండగానే స్టవ్ ఆఫ్ చెయ్యాలి. లేకపోతే వాటి ఫ్లేవర్ తగ్గిపోతుంది.
అది చల్లారాక ఉప్పు వేసి మెత్తగా మిక్సీ పట్టాలి. తర్వాత స్టవ్ పై బాండీ పెట్టి కొద్దిగా నూనె వేసి వేడి చెయ్యాలి. నూనె వేడి అయ్యాక ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, శనగ పప్పు, మినపప్పు, పల్లీలు చేసి రెండు నిమిషాలు వేగించాలి.
తర్వాత దానిలో మిక్సీ పట్టిన మిశ్ర మాన్ని వేసి కలిపి కొద్ది సేపు వేగించాక అన్నం వేసి కలిపి రెండు నిమిషాలు వేగిస్తే రుచికరమైన 'కరివేపాకు అన్నం' రెడీ జీడిపప్పుతో గార్నిష్ చేసి తింటే టేస్టీగా ఉంటుంది. కరివేపాకు రోజు ఉంటే జుట్టు రాలకుండా ఉంటుంది.
–వెలుగు, లైఫ్–
