మాస్కులు, సోషల్‌ డిస్టెంసింగ్‌… కర్నాటకలో ప్రారంభమైన పది పరీక్షలు

మాస్కులు, సోషల్‌ డిస్టెంసింగ్‌… కర్నాటకలో ప్రారంభమైన పది పరీక్షలు
  • 8లక్షల మంది స్టూడెంట్స్‌కు పరీక్షలు
  • ఏర్పాట్లు చేసిన ప్రభుత్వం

బెంగళూరు: పరీక్షలు అంటే చాలు పెన్ను, అట్ట, పెన్సిల్‌ పట్టుకుని వెళ్తాం. కానీ ఈ కరోనా కాలంలో శానిటైజర్‌‌, మాస్కు పట్టుకెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. కర్నాటకలో గురువారం పది పరీక్షలు ప్రారంభమయ్యాయి. ఏ స్టూడెంట్‌ చేతిలో చూసినా శానిటైజర్‌‌, మాస్క్‌లే కనిపించాయి. సోషల్‌ డిస్టెంసింగ్‌ పాటిస్తూ, మాస్కులుపెట్టుకుని స్క్రీనింగ్‌ చేయించుకుంటూ కనిపించారు స్టూడెంట్స్‌. రాష్ట్రంలో మొత్తం 8లక్షల మంది స్టూడెంట్స్‌కు కర్నాటక ప్రభుత్వం పరీక్షలు నిర్వహిస్తోంది. కరోనా నేపథ్యంలో స్టూడెంట్స్‌కు ఎలాంటి ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకుంది. “ పదో తరగతి అనేది విద్యార్థుల జీవితంలో ఒక మైలు రాయి. పరీక్షలు నిర్వహించడం రాష్ట్ర ప్రభుత్వ బాధ్యత. అందరితో సంప్రదింపులు జరిపి పరీక్షలు నిర్వహించేందుకు నిర్ణయం తీసుకున్నాం. ఈ విషయంలో హైకోర్టుకి ఎస్వోపీ కూడా ఇచ్చాం” అని కర్నాటక ఎడ్యుకేషన్‌ మినిస్టర్‌‌ సురేశ్‌ కుమార్‌‌ చెప్పారు.

స్టూడెంట్స్‌ సేఫ్టీనే ప్రియారిటీ అని అందుకే ఒక్కో క్లాసులో కేవలం 18 మందిని మాత్రమే అనుమతిస్తున్నాం అని చెప్పారు. పెద్ద క్లాస్‌ రూమ్‌లో అయితే 20 మందిని అనుమతిస్తున్నట్లు చెప్పారు. మాస్కులు లేని వారికి సెంటర్లలో మాస్కులు ఇస్తున్నామని, శానటైజ్‌ చేసి కచ్చితంగా సోషల్‌ డిస్టెంసింగ్‌ పాటించే విధంగా చర్యలు తీసుకున్నామని మంత్రి చెప్పారు. దీంతో పాటు స్కూళ్లు కూడా ప్రత్యేక చర్యలు తీసుకున్నాయని చెప్పారు. ప్రతి స్టూడెంట్‌కి కచ్చితంగా టెంపరేచర్‌‌ టెస్ట్ చేసి లోపలికి పంపిస్తున్నట్లు టీచర్చ్‌ చెప్పారు. కంటైన్మెంట్‌ జోన్ల నుంచి వచ్చే వారిని ప్రత్యేక గదుల్లో కూర్చొబెడుతున్నామని అన్నారు.