గడ్డపోతారంలో .. హెటిరో పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం

 గడ్డపోతారంలో ..  హెటిరో పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం
  • ప్రాణ భయంతో బయటకు పరుగులు తీసిన కార్మికులు

జిన్నారం, వెలుగు :  సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం గడ్డపోతారంలోని హెటిరో పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. పరిశ్రమలోని ఈటీపీ సెక్షన్​లో ప్రమాదం జరగడంతో ఒక్కసారిగా మంటలు, దట్టమైన పొగలు వ్యాపించాయి. పోలీసులు, కార్మికుల కథనం ప్రకారం.. సోమవారం మధ్యాహ్నం 2 గంటల సమయంలో పరిశ్రమలోని ఈటీపీ ప్లాంట్​లో సాల్వెంట్ల రికవరీ సమయంలో ప్రమాదవశాత్తు మంటలు అంటుకున్నాయి. దీంతో భయాందోళనకు గురైన కార్మికులు ఒక్కసారిగా బయటకు పరుగులు తీశారు. 

భారీగా మంటలు ఎగిసిపడడంతో పరిశ్రమ అధికారులు ఫైర్ ఇంజన్లకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్​ సిబ్బంది ఎగిసిపడుతున్న మంటలను అదుపులోకి తీసుకురావడానికి ప్రయత్నించారు. దాదాపు మూడు గంటలు శ్రమించి మంటలను ఆర్పారు. కాగా ఎలాంటి ప్రాణా నష్టం జరగలేదని బొల్లారం సీఐ గంగాధర్ తెలిపారు. ఆస్తి నష్టం భారీగా సంభవించి ఉంటుందని స్థానికులు అంచనా వేస్తున్నారు.