ఒకే అడ్రస్​లో 28 ఓట్లా?..  ఈసీకి ఫిర్యాదు చేసినా స్పందన లేదు: విశ్వేశ్వర్​ రెడ్డి

ఒకే అడ్రస్​లో 28 ఓట్లా?..  ఈసీకి ఫిర్యాదు చేసినా స్పందన లేదు: విశ్వేశ్వర్​ రెడ్డి

హైదరాబాద్, వెలుగు: శేర్ లింగంపల్లి అసెంబ్లీ సెగ్మెంట్​లో  భారీగా దొంగ ఓట్లు నమోదు చేశారని బీజేపీ నేత, మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్​ రెడ్డి  ఆరోపించారు. రెండు గదులు, ఒక బాత్రూం ఉన్న షెడ్​లో 28 మంది హిందువులు, ముస్లింలు, క్రిస్టియన్లు నివసిస్తున్నారని పేర్కొంటూ ఓటరు లిస్ట్​ను బుధవారం ట్విట్టర్ లో ఆయన పోస్టు చేశారు.

దొంగ ఓట్లను సీఎం కేసీఆర్  ఆయుధంగా మలుచుకుంటున్నారని విమర్శించారు. రాష్ట్రంలో వేలాది దొంగ ఓట్లు ఉన్నాయని గుర్తించి, ఈ ఏడాది మార్చిలో రాష్ట్ర ఎన్నికల సంఘానికి, రంగారెడ్డి జిల్లా కలెక్టర్​కు ఫిర్యాదు చేసినా స్పందించడం లేదన్నారు. శేర్ లింగంపల్లి నియోజకవర్గంలో 70 వేల దొంగ ఓట్లు ఉన్నాయని ఆయన తెలిపారు. మున్సిపల్  ఎన్నికల సమయంలో కూడా మణికొండ మున్సిపాలిటీలో దొంగ ఓట్లు బయట పెట్టామని ఆయన గుర్తుచేశారు.

ఒకే ఇంటి నంబర్​లో 50 ఓట్లు ఉన్నాయని, ఆ అడ్రస్ కు తాము వెళ్లి చూస్తే అక్కడ ఫర్నిచర్ షాప్ ఉందని, ఆ అడ్రస్​లో ఒక్కరు కూడా నివాసం ఉండటం లేదని తెలిపారు. తమ ఫిర్యాదుతో ఆ ఓట్లను ఎన్నికల కమిషన్​ తొలగించిందన్నారు. ఇప్పటి కైనా దొంగ ఓట్లను తొలగించాలని ఆయన డిమాండ్ చేశారు.