నెలాఖరులోగా మాస్టర్​ ప్లాన్–2050 .. త్వరలో మరిన్ని లే అవుట్​లు వేస్తం : హెచ్ఎండీఏ కమిషనర్ ​సర్ఫరాజ్ ​అహ్మద్

నెలాఖరులోగా మాస్టర్​ ప్లాన్–2050 .. త్వరలో మరిన్ని లే అవుట్​లు వేస్తం : హెచ్ఎండీఏ కమిషనర్ ​సర్ఫరాజ్ ​అహ్మద్
  • ఓఆర్ ఆర్, ట్రిపుల్​ఆర్ పరిధిలో హౌసింగ్ డెవలప్​మెంట్  
  • సామాన్యుల సొంతింటి కల నెరవేర్చేలా లోకల్ ఏరియా ప్లాన్​
  • సామాన్యులకు అందుబాటులో ఉండేలా ప్రణాళికల రూపకల్పన

హైదరాబాద్​సిటీ, వెలుగు: హైదరాబాద్  ఔటర్ రింగ్​రోడ్​తో పాటు ట్రిపుల్ ఆర్ వరకూ విస్తరించిన హెచ్ఎండీఏ త్వరలో  నిర్మాణాత్మక అభివృద్ధి చేయనుందని హెచ్ఎండీఏ కమిషనర్ ​సర్ఫరాజ్​ అహ్మద్​ తెలిపారు. హౌసింగ్​కు పెద్దపీట వేయాలని నిర్ణయించామన్నారు. త్వరలో నే సమగ్ర హౌసింగ్ డెవలప్​ మెంట్​పాలసీ తెస్తున్నామన్నారు.  మధ్యతరగతి ప్రజల సొంతింటి కలలను నిజం చేసేందుకు ప్రస్తుతం అమలులో ఉన్న టౌన్ ​ప్లానింగ్ లాగే లోకల్ ఏరియా డెవలప్​మెంట్ ప్లాన్ అమలు చేయనున్నామన్నారు.  శనివారం  తన ఆఫీసులో మీడియాతో ఆయన మాట్లాడారు. హెచ్ఎండీఏను సంస్థాగతంగా బలోపేతం చేసేందుకు జూన్ లోగా మాస్టర్​ప్లాన్​–2050 అందుబాటులోకి రానుందన్నారు. 

ఇందులో భాగంగా ప్రస్తుతం భారీ నిర్మాణాలు, విల్లాలు, టౌన్​షిప్​లకు ఇస్తున్న పర్మిషన్ల మాదిరిగానే సామాన్య ప్రజలకు చిన్న  లేఅవుట్లు వేసి ప్లాట్లను విక్రయిస్తామన్నారు. ఇందుకు  త్వరలోనే ఓఆర్​ఆర్ పరిధిలోని కండ్లకోయ, ప్రతాప్​సింగారం, మేడిపల్లి, కోకాపేట, కీసర, బుద్వేల్ తదితర ప్రాంతాల్లో సామాన్యులకు అందుబాటులో ఉండేలా ప్లాట్లను అందిస్తామన్నారు.  ప్రభుత్వ భూములు, రైతుల నుంచి ల్యాండ్ పూలింగ్ ద్వారా  సేకరిస్తామన్నారు. 

వాటిని లే అవుట్లు చేసి విక్రయించాలని నిర్ణయించినట్టు తెలిపారు. లోకాస్ట్ ఏరియా డెవలప్​మెంట్​లో భాగంగా ప్లాట్లు కొన్న వారికి నేరుగా ఇల్లు కట్టుకునే సదుపాయాలు కల్పిస్తామన్నారు. గ్రేటర్  సిటీలో లేక్ ప్రొటెక్షన్ పై కూడా ప్రత్యేక చర్యలు తీసుకోనున్నట్టు కమిషనర్ తెలిపారు. ప్రస్తుతం ఓఆర్​ఆర్​లోపలి ప్రాంతాల్లో 476 చెరువులు, ఓఆర్ఆర్ వెలుపల మరో 2,786  చెరువులు ఉన్నట్టు వివరించారు. త్వరలో కొన్ని చెరువులను నోటిఫై చేసి  పరిరక్షణ చర్యలు తీసుకుంటామన్నారు.

ఆగస్టులో ఎలివేటెడ్ కారిడార్ పనులు

ఎలివేటెడ్ కారిడార్ పనులకు సంబంధించి భూ సేకరణ పనులు కొలిక్కి వచ్చాయన్నారు. ప్యారడైజ్ నుంచి ఆర్మీ డెయిరీ ఫామ్​రోడ్డు వైపు నిర్మించేందుకు  టెండర్ల ప్రక్రియ పూర్తయిందన్నారు.  జేబీఎస్​ నుంచి శామీర్​పేట వరకూ నిర్మించే ఎలివేటెడ్ కారిడార్ భూసేకరణ ప్రక్రియ పూర్తి కావచ్చిందన్నారు. డిఫెన్స్​, ఆర్​అండ్​బీ, అటవీశాఖతో జరిగిన చర్చలు ఫలించామన్నారు. త్వరలోనే డిఫెన్స్ భూముల సేకరణపై ఎంఓయూ కుదుర్చుకుని పనులను ఆగస్టులో ప్రారంభించేలా చర్యలు తీసుకుంటామన్నారు.  భారీ వృక్షాలను ట్రాన్​లొకేషన్ పద్ధతి ద్వారా వేరే ప్రాంతాల్లో నాటేందుకు చర్యలు తీసుకుంటామన్నారు.

  ఈ ప్రాంతంలో వాటర్, సీవరేజ్, కరెంట్ లైన్లను కూడా పక్కకు జరిపే పనులు త్వరలో పూర్తి చేస్తామన్నారు. ఇక ఓఆర్ఆర్​ నుంచి ట్రిపుల్ ​ఆర్ వరకూ నిర్మించ తలపెట్టిన రేడియల్​రోడ్లకు సంబంధించి కూడా కాంట్రాక్టు పనులు పూర్తయ్యాయన్నారు. టెక్నికల్ బిడ్​ పూర్తి చేశామని, ఫైనాన్షియల్ బిడ్​ త్వరలో ఓపెన్ చేస్తామన్నారు. రావిర్యాల నుంచి ఆమన్​గల్ వరకూ నిర్మించే రేడియల్ రోడ్లకు సంంధించి 8 కి.మీ. మేర భూములను సేకరించాల్సి వుందన్నారు. దీనికి సంబంధించి ఫారెస్ట్ అధికారులతో చర్చలు జరుపుతున్నట్టు తెలిపారు. సర్ఫరాజ్ తోపాటు హెచ్​ఎండీఏ జాయింట్ మెట్రోపాలిటన్ ​కమిషనర్​ కోటా శ్రీవత్స, కార్యదర్శి ఉపేందర్​రెడ్డి  తదితరులు ఉన్నారు.