మే 31 నిర్జల ఏకాదశి.. ఇలా చేస్తే లక్ష్మీదేవి ప్రసన్నం...  దరిద్రం పరార్..

మే 31 నిర్జల ఏకాదశి.. ఇలా చేస్తే లక్ష్మీదేవి ప్రసన్నం...  దరిద్రం పరార్..

సనాతన ధర్మంలో 24 ఏకాదశుల గురించి ప్రస్తావన ఉంది. అధికమాసం వస్తే మరో రెండు ఏకాదశులు కలుపుకుని 26 వస్తాయి. తిథుల్లో ఏకాదశి ఎప్పుడూ శుభప్రదమే. మరి జ్యేష్ఠమాసంలో వచ్చే నిర్జల ఏకాదశి ( మే31)  ప్రత్యేకత ఏంటి...ఈ రోజు ఉపవాసం ఉండి వ్రతమాచరిస్తే 24 ఏకాదశుల్లో పుణ్యఫలం ఈ ఒక్కరోజే దక్కుతుందని ఎందకంటారో చూద్దాం.

మే 31 నిర్జల ఏకాదశి

జేష్ఠ మాసంలో వచ్చే శుక్లపక్ష ఏకాదశి నాడు నిర్జల ఏకాదశిగా చెబుతారు. 2023 వ సంవత్సరంలో మే 31వ తేదీన  నిర్జల ఏకాదశి వస్తుంది. నిర్జల ఏకాదశి తిథి మే 30 వ తేదీన మధ్యాహ్నం 1:32 నిమిషాలకు ప్రారంభమై, మే 31వ తేదీ మధ్యాహ్నం 01:36 నిమిషాలకు ముగిస్తుంది. అయితే  పంచాంగం ప్రకారం ఏదైనా ఉదయం వచ్చిన తిధిని ప్రామాణికంగా తీసుకుంటారు కాబట్టి మే 31వ తేదీని ఏకాదశి జరుపుకుంటారు.  ఈరోజు (మే 31) ఎవరైతే విష్ణుమూర్తిని, లక్ష్మీదేవిని నిష్ఠగా పూజిస్తారో వారికి సకల సౌఖ్యాలు ప్రాప్తిస్తాయని చెబుతారు. ఈరోజు భూ, కనక, వస్తు, వాహనాలు కొనుగోలు చేస్తే అన్ని విషయాలలోనూ కలిసివస్తుందని, కొనుగోలు చేసిన దాని విలువ రెట్టింపు అవుతుందని చెబుతారు.

లక్ష్మీదేవికి అర్చన..

ఏడాది పొడవునా విష్ణుమూర్తిని, లక్ష్మీదేవిని పూజించలేకపోయిన వారు ఈ ఒక్కరోజు ( మే 31)  నిష్టతో లక్ష్మీదేవిని పూజిస్తే సంవత్సరమంతా పూజ చేసిన ఫలితం వస్తుందని చెబుతారు. నిర్జల ఏకాదశి రోజున నీరు, ఆహారం తీసుకోకుండా ఉపవాసం చేస్తే పాపాల నుండి విముక్తి లభిస్తుందని చెబుతారు. నిర్జల ఏకాదశి రోజున ఉదయాన్నే లేచి తలస్నానం చేసి విష్ణువుని పూజించాలి. విష్ణు పూజలో తులసిని తప్పనిసరిగా పెట్టాలి. విష్ణు పూజలో తులసి లేకుంటే పూజ అసంపూర్ణంగా చేసినట్టు అవుతుంది. విష్ణు భగవానుడుకి పసుపును సమర్పించాలి. ఉపవాసం పాటించి దానధర్మాలు చేస్తే మరింత మెరుగైన ఫలితాలు వస్తాయి. నిర్జల ఏకాదశి రోజున ఉపవాసం దానధర్మాలు చేయడం వల్ల లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకోవచ్చు.

రావి చెట్టును పూజిస్తే...

అంతేకాదు ఏకాదశి నాడు రావి చెట్టును పూజించడం వల్ల కూడా లక్ష్మీదేవి ప్రసన్నురాలు అవుతుంది. రావి చెట్టుకు పాలు కలిపిన నీళ్లను, ధూప, దీపాలను సమర్పించడం వల్ల సంపద పెరుగుతుంది. నిర్జల ఏకాదశి నాడు జల దానం చేసినా, అన్న దానం చేసిన లక్ష్మీదేవి కటాక్షం లభిస్తుంది. అంతేకాదు కుండను దానం చేయడం కూడా శుభప్రదంగా పరిగణించబడుతుంది.

పురుషార్థాలను జయించేందుకే ఉపవాసం

ధర్మ, అర్థ, కామ, మోక్షాలు అనే నాలుగు పురుషార్థాలను జయించేందుకు ఏకాదశి రోజు ఉపవాసాన్ని ఆచరించాలని మహర్షి వేదవ్యాసుడు పాండవులకు చెప్పాడు. వెంటనే స్పందించిన భీముడు వినయంతో వ్యాసుడికి నమస్కరిస్తూ.. "స్వామి మీరు ప్రతి పదిహేను రోజులకోసారి వచ్చే ఏకాదశికి ఉపవాసం ఉండాలని చెబుతున్నారు. నేను ఒక్క రోజు కూడా తినకుండా ఉండనలేను. మరి ఏకాదశి రోజు తినకుండా వ్రతం ఎలా ఆచరించగలను" అని భీముడు అడిగాడు. అప్పుడు వ్యాసుడు ఇలా చెప్పాడు... "నువ్వు ప్రతి ఏకాదశికి ఉపవాసం ఉండాల్సిన అవసరం లేదు. కేవలం జ్యేష్ఠ మాసం శుక్లపక్షంలో వచ్చే నిర్జల ఏకాదశి ఒక్క రోజు ఉపవాసం ఉంటే అన్ని ఏకాదశుల పుణ్యఫలం దక్కుతుందన్నాడు. అప్పటి నుంచి ఏటా నిర్జల ఏకాదశి రోజు మాత్రమే భీముడు ఉపవాసం ఉండటంతో ఈ ఏకాదశిని భీమసేన ఏకాదశి అనికూడా అంటారు.

చుక్క నీరుకూడా తీసుకోరు

ఈ పర్వదినం రోజు చుక్క నీరు కూడా తీసుకోకుండా ఉపవాసం ఉంటారు. అందుకే నిర్జల ఏకాదశి అంటారు. నిర్జల ఏకాదశి ఈ ఏడాది మే 31న వచ్చింది.  ఈ రోజు ఉపవాసం చేయాలి, నేలపైనే నిద్రించాలి, మరుసటి రోజు అంటే ద్వాదశి రోజు తెల్లవారుజామునే నిద్రలేచి పూజచేయాలి. అష్టాక్షరి మంత్రం  "ఓం నమో భగవతే వాసుదేవాయ" అని జపించాలి. అనంతరం ఏకాదశికి సంబంధించిన కథ చెప్పుకుని హారతివ్వాలి. అతిథులను పిలిచి భోజనం పెట్టడం, బ్రాహ్మణుడికి స్వయంపాకం ఇవ్వడం, చలివేంద్రాలు ఏర్పాటు చేయడం సహా దాన ధర్మాలకు ఇదే సరైన రోజు అని పండితులు చెబుతారు. నిర్జల ఏకాదశి వ్రతాన్ని భక్తిశ్రద్ధలతో ఆచరిస్తే సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉంటారని, ఆర్థిక సమస్యలు తీరుతాయని భక్తుల విశ్వాసం. 

అక్షయ తృతీయ కంటే ప్రాధాన్యత ఉన్న రోజు

నిర్జల ఏకాదశికి అక్షయ తృతీయ కంటే ఎక్కువ ప్రాధాన్యత ఉందని చెబుతారు పండితులు. ఈరోజు ఎవరైతే శ్రీ మహావిష్ణువును, లక్ష్మీదేవిని నిష్ఠగా పూజిస్తారో వారికి సకల సౌఖ్యాలు ప్రాప్తిస్తాయని చెబుతారు. ఈరోజు భూ, కనక, వస్తు, వాహనాలు కొనుగోలు చేస్తే అన్ని విషయాలలోనూ కలిసివస్తుందని, కొనుగోలు చేసిన దాని విలువ రెట్టింపు అవుతుందని విశ్వాసం.   ఏకాదశిరోజు రావి చెట్టును పూజించడం వల్ల కూడా లక్ష్మీదేవి ప్రసన్నురాలు అవుతుంది. రావి చెట్టుకు పాలు కలిపిన నీళ్లను, ధూప, దీపాలను సమర్పించడం వల్ల సంపద పెరుగుతుంది. నిర్జల ఏకాదశి నాడు జల దానం చేసినా, అన్న దానం చేసిన లక్ష్మీదేవి కటాక్షం లభిస్తుంది. అంతేకాదు కుండను దానం చేయడం కూడా శుభప్రదంగా చెబుతారు.