
మాదాపూర్/ గచ్చిబౌలి, వెలుగు: ఐటీ కారిడార్లో వరద ముంపు ప్రాంతాలను హైడ్రా కమిషనర్ రంగనాథ్ సోమవారం (జూన్ 10) పరిశీలించారు. నాలాల్లో వరద సాఫీగా సాగుతుందా, ఎక్కడైనా ఆటంకాలు ఉన్నాయా? అని క్షుణ్ణంగా పరిశీలించారు. చినుకు పడితే నీట మునుగుతున్న నెక్టార్ గార్డెన్స్ పరిసరాల్లో వరద నిలవకుండా తీసుకోవాల్సిన చర్యలపై జీహెచ్ఎంసీ, ఇరిగేషన్, జలమండలి అధికారులతో చర్చించారు.
ఎండాకాలంలోనూ దుర్గం చెరువులో నీళ్లు ఉండడంతో వానకాలం వచ్చేసరికి నిలువలను తగ్గిస్తే వరద పోటెత్తదని అధికారులు కమిషనర్కు సూచించారు. వర్షం పడితే నడుములోతు నీళ్లు తమ కాలనీలో నిలబడుతున్నాయని ఈ సందర్భంగా స్థానికులు కమిషనర్ దృష్టికి తీసుకెళ్లారు. అనంతరం దుర్గం చెరువు ఇన్ ఫ్లో, ఔట్ ఫ్లో అంశాలను చెరువు చుట్టూ తిరిగి కమిషనర్ పరిశీలించారు.
చెరువు దిగువ భాగంలో ఆక్రమణతో పాటు వరద కాలువకు ఉన్న ఆటంకాలనూ పరిశీలించారు. ఇనార్బిట్ మాల్ వైపు మట్టి పోయడం, వాహనాల పార్కింగ్పై ఆరా తీశారు. దుర్గం చెరువు వరద కాలువకు ఆటంకం లేకుండా ఎంత మొత్తం నీరు విడుదల చేసినా సాఫీగా మల్కం చెరువుకు చేరేలా చూడాలని అధికారులను ఆదేశించారు.
దుర్గం చెరువులో నీటి నిర్వహణపై ఇరిగేషన్, జలమండలి, జీహెచ్ఎంసీ అధికారులతో త్వరలో సమావేశాన్ని ఏర్పాటు చేయాలని హైడ్రా కమిషనర్ రంగనాథ్ నిర్ణయించారు. వరద కాలువలను విస్తరించడం, మాదాపూర్ ప్రాంతంలో వరద ముప్పు తగ్గించడం వంటి విషయాలను ఈ సమావేశంలో చర్చించనున్నారు.