మేడారం భక్తుల ట్రాక్టర్​ను ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు

మేడారం భక్తుల ట్రాక్టర్​ను ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు

ములుగు, వెలుగు: మేడారం సమ్మక్క, సారలమ్మ జాతరకు వెళ్తున్న భక్తుల ట్రాక్టర్​ను ఆర్టీసీ బస్సు ఢీకొట్టడంతో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. మంగళవారం జనగామ జిల్లా లింగాలఘనపూర్ గ్రామానికి చెందిన 20 మంది భక్తులు ట్రాక్టర్​లో మేడారం బయలుదేరారు. ములుగు జిల్లా మహ్మద్​గౌస్ పల్లి వద్ద  హనుమకొండ నుంచి మేడారం వెళ్తున్న ఓ ఆర్టీసీ బస్సు ట్రాక్టర్​ను ఢీకొట్టుకుంటూ వెళ్లింది. దీంతో ఒక్కసారిగా ట్రాక్టర్​ట్రాలీ పల్టీ కొట్టి బోల్తా పడింది. ట్రాలీలోని ఆరుగురి కాళ్లు, చేతులకు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు వారిని వెంటనే 108లో వరంగల్ ఎంజీఎంకు తరలించారు. 

రాములమ్మ అనే మహిళకు సీరియస్​గా ఉన్నట్లు తెలిసింది. అయితే ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు డ్రైవర్​ఆపకుండా వెళ్లిపోవడంతో బాధితులు రోడ్డుపై ధర్నాకు దిగారు. ములుగు వైపు వెళ్లే వాహనాలను అడ్డుకున్నారు. దీంతో సుమారు రెండు కిలోమీటర్ల మేర ట్రాఫిక్​ నిలిచిపోయింది. మేడారం వెళ్లే భక్తులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ట్రాక్టర్​ను ఢీకొట్టిన బస్సు డ్రైవర్​ను తీసుకురావాలని బాధితులు డిమాండ్​చేశారు. ములుగు సీఐ రంజిత్ కుమార్ ఘటనా స్థలానికి చేరుకొని ప్రమాదానికి గురైన ట్రాక్టర్​ను పక్కకు తీయించారు. బాధితులకు న్యాయం చేస్తామని నచ్చజెప్పడంతో గంట తర్వాత ఆందోళన విరమించారు. ఆందోళన సమయంలో బాధితుల్లో ఒకరు ట్రాఫిక్​లో చిక్కున్న ఆర్టీసీ బస్సు అద్దాన్ని పగలగొట్టారు.