సీకెంట్ పైల్స్ ఫైళ్లు మిస్సింగ్?..మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల్లో కీలకమైన టెక్నాలజీ

సీకెంట్ పైల్స్ ఫైళ్లు మిస్సింగ్?..మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల్లో కీలకమైన టెక్నాలజీ
  • వాటికి సంబంధించిన నిర్ణయాల రికార్డులను అడిగిన కమిషన్​ 
  • ఆ ఫైళ్లు దొరకడం లేదని సర్కారుకు ఇరిగేషన్ శాఖ సమాచారం 
  • వాటిని వెతికే పనిలో పడిన అధికారులు

హైదరాబాద్, వెలుగు:మేడిగడ్డ బ్యారేజీ వైఫల్యానికి ప్రధాన కారణం.. ఆ బ్యారేజీ ఫౌండేషన్​కు వాడిన ‘సీకెంట్​పైల్స్(పునాదిలో స్తంభాల వంటి నిర్మాణాలు)’ అని ఇప్పటికే అధికారులు విచారణలో తేల్చిచెప్పారు. సీకెంట్​పైల్స్ కటాఫ్​లు, నిర్వహణ సరిగ్గా లేకపోవడంతో పైపింగ్ యాక్షన్ (ఫౌండేషన్​లో సీపేజీ ఏర్పడి నీళ్లు లీకేజ్ కావడం) జరిగి బ్యారేజీ కింద భారీ గొయ్యి పడిందని అంటున్నారు. ఈ నేపథ్యంలోనే కాళేశ్వరం జ్యుడీషియల్ కమిషన్.. సీకెంట్​ పైల్స్​కు ఇచ్చిన అనుమతులపైనా దృష్టి సారించినట్టు తెలిసింది. ఓ వైపు కాళేశ్వరం ప్రాజెక్టు బ్యారేజీల నిర్మాణానికి సంబంధించిన కేబినెట్ అనుమతుల గురించి ఆరా తీస్తున్న కమిషన్.. ఇటు సీకెంట్​పైల్స్​పై అనుమతులు, వాటికి సంబంధించిన రికార్డులనూ ఇవ్వాల్సిందిగా ప్రభుత్వాన్ని కోరినట్టు తెలిసింది. 

ఆ ఫైల్స్ ఇవ్వాలని ఇరిగేషన్ అధికారులను ప్రభుత్వం ఆదేశించగా.. అధికారులు వాటిని వెతికే పనిలో పడ్డారు. అయితే, సీకెంట్ పైల్స్​ టెక్నాలజీపై తీసుకున్న నిర్ణయాలకు సంబంధించిన రికార్డులు కనిపించడం లేదని తెలిసింది. ఎక్కడ వెతికినా అవి దొరకడం లేదని సమాచారం. ఇప్పటికే బ్యారేజీలకు సంబంధించి కేబినెట్ తీసుకున్న నిర్ణయాల ఫైళ్లను కమిషన్​కు అందించినా.. ఈ సీకెంట్​పైల్స్ ఫైళ్లు మాత్రం దొరకడం లేదని ప్రభుత్వానికి అధికార వర్గాలు సమాచారమిచ్చినట్టు తెలిసింది.

 2020లో ఇరిగేషన్ శాఖ పునర్వ్యవస్థీకరణలో భాగంగా చాలా మంది అధికారుల కేడర్, స్థానాలు మారాయి. అప్పుడే ఈ రికార్డులు తారుమారై ఉండొచ్చన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే, అంత పెద్ద ప్రాజెక్టు కడుతున్నప్పుడు ఆ రికార్డులను భద్రంగా దాచకపోవడమేంటన్న సందేహాలూ వస్తున్నాయి. 

దేశంలో ఎక్కడా వాడని టెక్నాలజీ.. 

సీకెంట్ పైల్స్ టెక్నాలజీని కాళేశ్వరం బ్యారేజీలైన మేడిగడ్డ, అన్నారం, సుందిళ్లకు మినహా దేశంలోని ఇతర ఏ బ్యారేజీలకూ వాడలేదు. మహారాష్ట్రలోని పలు నిర్మాణాలకు సీకెంట్​పైల్స్ టెక్నాలజీని వాడినా.. బ్యారేజీలు, డ్యామ్​ల వంటి నిర్మాణాలకు దానిని వాడిన చరిత్ర లేదు. దేశంలోనే తొలిసారిగా ఫ్లోటింగ్ బ్యారేజీలుగా నిర్మించేందుకుగాను కాళేశ్వరం బ్యారేజీలకు వీటిని వాడారు. 

బ్యారేజీలన్నింటినీ ఐఎస్(ఇండియన్ స్టాండర్డ్) కోడ్స్​ప్రకారమే నిర్మించినా.. ఒక్క సీకెంట్​పైల్స్​కు మాత్రం బ్రిటీష్ కోడ్స్​ను వాడినట్టుగా చెబుతున్నారు. బ్రిటీష్​ కోడ్స్​ను మన ఐఎస్ కోడ్స్​కు అన్వయించుకుని.. సీకెంట్​పైల్స్​కు డిజైన్ చేశారని అంటున్నారు. ఈ నేపథ్యంలోనే అసలు ఈ టెక్నాలజీనే ఎందుకు ఎంచుకోవాల్సి వచ్చిందన్నదానిపై కాళేశ్వరం జ్యుడీషియల్ కమిషన్​దృష్టి సారించినట్టు తెలిసింది. 

అందులో భాగంగానే దానికి సంబంధించి తీసుకున్న నిర్ణయాల ఫైళ్లను ఇవ్వాల్సిందిగా కమిషన్ కోరినట్టు సమాచారం. ఆ టెక్నాలజీని వాడాలని ఆదేశించింది ఎవరు.. ఆమోదించింది ఎవరు అన్న వివరాలను ఇవ్వాల్సిందిగా ప్రభుత్వాన్ని కోరినట్టు తెలిసింది. అయితే, ఇప్పుడు కీలకమైన ఆ ఫైళ్లే దొరకడం లేదని అధికారవర్గాలు చెప్తున్నట్టుగా తెలుస్తున్నది. 

కాగా, జూన్ 30 నాటికే అన్ని ఫైళ్లను కమిషన్​కు ఇస్తామని సర్కారు ఇదివరకే చెప్పింది. అందులో భాగంగా బ్యారేజీల నిర్మాణం కేబినెట్ అనుమతి లేకుండానే జరిగిందని పేర్కొంటూ ఫైళ్లను సబ్​మిట్ చేసింది. ఇప్పుడు మిగిలిన ఈ సీకెంట్ పైల్స్ ఫైళ్లనూ వీలైనంత త్వరగా ఇవ్వాలని ఇరిగేషన్ శాఖ వర్గాలను ఉన్నతాధికారులు ఆదేశించినట్టు తెలిసింది.