
హైదరాబాద్, వెలుగు : ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను మంగళవారం బంజారాహిల్స్లోని ఆమె నివాసంలో తమిళనాడు, కర్నాటక, కేరళ రాష్ట్రాల రైతు నాయకులు కలిశారు. ఈ సందర్భంగా రాష్ట్ర సర్కారు అమలు చేస్తున్న రైతు సంక్షేమ కార్యక్రమాలను కవిత వారికి వివరించారు. వ్యవసాయానికి 24 గంటల ఉచిత కరెంట్ ఇవ్వడం ఒక్క కేసీఆర్కే సాధ్యమైందని చెప్పారు. రైతుబంధు, బీమా లాంటి పథకాలు దేశమంతా అమలు చేయాలని రైతు నాయకులు ఈ సందర్భంగా అభిప్రాయపడ్డారు. కేసీఆర్ ఇచ్చిన ‘అబ్ కీ బార్ కిసాన్ సర్కార్’ నినాదం రైతుల్లో ప్రభావం చూపుతుందని తెలిపారు. రైతుల సంక్షేమం కోసం కృషి చేస్తున్న కేసీఆర్ నాయకత్వంలో పనిచేయడానికి తాము సిద్ధంగా ఉన్నామన్నారు. కాగా, కవితతో భేటీ అనంతరం వారు ప్రగతి భవన్కు వెళ్లి కేసీఆర్ను కలిశారు. రైతుల కోసం తాము బీఆర్ఎస్తో కలిసి పని చేస్తామని పేర్కొన్నారు.