మెగాస్టార్ చిరంజీవి ఫుల్ జోష్ లో ఉన్నారు. ఈ ఏడాది సంక్రాంతికి 'మన శంకర వరప్రసాద్ గారు' చిత్రం బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టించింది. ఏకంగా రూ. 350 కోట్లకు పైగా వసూళ్లు సాధింంచి తన కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్ అందుకున్నారు చిరు. అనిల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా, మెగాస్టార్లోని వినోదాన్ని, మాస్ను సరికొత్తగా ఆవిష్కరించింది. ఈ విజయ ఉత్సాహంలో ఉన్న మెగాభిమానులకు ఇప్పుడు మరో అదిరిపోయే వార్త ఒకటి నెట్టింట హల్ చల్ చేస్తోంది.
మళ్ళీ 'వాల్తేరు వీరయ్య' కాంబో మ్యాజిక్
గతంలో 'వాల్తేరు వీరయ్య' వంటి ఇండస్ట్రీ హిట్ అందించిన దర్శకుడు బాబీ కొల్లితో చిరంజీవి మరోసారి చేతులు కలిపారు. 'మెగా 158' (వర్కింగ్ టైటిల్) సినిమా షూటింగ్ గురించి గత కొన్ని రోజులుగా రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. తాజా సమాచారం ప్రకారం, ఈ ప్రతిష్టాత్మక చిత్రానికి సంబంధించిన పూజా కార్యక్రమాలు,రెగ్యులర్ షూటింగ్ ఏప్రిల్ 20 నుంచి ప్రారంభం కానున్నాయి.
చిరు సరసన ప్రియమణి..
యశ్ 'టాక్సిక్', విజయ్ 'జన నాయకన్' వంటి భారీ చిత్రాలను నిర్మిస్తున్న KVN ప్రొడక్షన్స్ ఈ సినిమాతో టాలీవుడ్లోకి అడుగుపెడుతోంది. ఈ సినిమాలో చిరంజీవి సరసన ప్రియమణి కథానాయికగా నటించబోతుండగా, యువ నటి ప్రీతి ముకుందన్ కీలక పాత్రలో కనిపించనుంది. అంతేకాకుండా, మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ ఒక ప్రత్యేక పాత్రలో కనిపిస్తారనే వార్త ఫిల్మ్ నగర్లో జోరుగా వినిపిస్తోంది. మాస్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్ అయిన థమన్ ఎస్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందిస్తున్నారు.
కుర్ర హీరోలకు పోటీగా..
బాబీ సినిమాతో పాటు, చిరంజీవి తన తదుపరి చిత్రాన్ని 'దసరా' ఫేమ్ శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో చేయబోతున్నారు. దీనిని నేచురల్ స్టార్ నాని సమర్పిస్తుండటం విశేషం. ఇది కాకుండా, సోషియో ఫాంటసీ మూవీ 'విశ్వంభర' కూడా విడుదలకు సిద్ధంగా ఉంది. 70 ఏళ్ల వయసులో కూడా కుర్ర హీరోలకు పోటీనిస్తూ వరుస ప్రాజెక్టులతో మెగాస్టార్ దూసుకుపోతున్నారు. బాబీ కొల్లి దర్శకత్వంలో రాబోతున్న ఈ పక్కా మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ 2027 సంక్రాంతి లక్ష్యంగా తెరకెక్కుతున్నట్లు తెలుస్తోంది.
