ఢీ అంటే ఢీ: ఇటు టీఆర్ఎస్-అటు బీజేపీ

ఢీ అంటే ఢీ: ఇటు టీఆర్ఎస్-అటు బీజేపీ

కరీంనగర్​లో దిష్టిబొమ్మ తగలబెట్టే విషయంలో గొడవ

కొట్లాటకు దిగిన ఇరువర్గాలు

బీజేపీ నేతలను ఈడ్చుకెళ్లి అరెస్టు చేసిన పోలీసులు

టీఆర్ఎస్​ కార్యకర్తలు కూడా అదుపులోకి..

కరీంనగర్, వెలుగు: కరీంనగర్​ టౌన్​లో ఆదివారం టీఆర్ఎస్, బీజేపీ కార్యకర్తల మధ్య గొడవ జరిగింది. బీజేపీ రాష్ట్ర చీఫ్​ బండి సంజయ్​ కామెంట్లను నిరసిస్తూ  టీఆర్ఎస్వీ కార్యకర్తలు దిష్టిబొమ్మను తగలబెట్టేందుకు ప్రయత్నించగా.. బీజేపీ నేతలు అడ్డుకోవడంతో లొల్లి మొదలైంది. మాటామాటా పెరిగి ఇరువర్గాలు తోసుకున్నాయి. కొట్లాటకూ దిగాయి. నడిరోడ్డుపైనే ఎదురెదురుగా బైఠాయించాయి. దీంతో పోలీసులు బీజేపీ నేతలు, కార్యకర్తలను బలవంతంగా ఈడ్చుకెళ్లి పోలీస్​స్టేషన్లకు తరలించారు. అదే సమయంలో టీఆర్ఎస్​ శ్రేణులను కూడా అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా సుమారు రెండు గంటల పాటు తీవ్ర ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.

ఇరువర్గాలు పోటాపోటీగా..

టీఆర్ఎస్వీ నేతలు, కార్యకర్తలు ఆదివారం పొద్దున కరీంనగర్​లోని తెలంగాణ చౌక్  వద్ద  ఆందోళనకు దిగారు. బీజేపీకి, సంజయ్​కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ.. దిష్టిబొమ్మను దహనం చేసేందుకు ప్రయత్నించారు. అయితే రాష్ట్ర సర్కారు విధానాలను వ్యతిరేకిస్తూ ఆందోళన చేపట్టిన బీజేపీ నేతలు అదే సమయానికి తెలంగాణ చౌక్​కు చేరుకున్నారు. దిష్టిబొమ్మను దహనం చేస్తున్న టీఆర్ఎస్వీ నాయకులను అడ్డుకున్నారు. ఈ క్రమంలో ఇరువర్గాల మధ్య మాటామాటా పెరిగింది. పరస్పరం తోసుకున్నారు. చివరికి కొట్లాటకు దిగారు. అక్కడున్న కొందరు పోలీసులు ఆపాలని చూసినా గొడవ అదుపులోకి రాలేదు. తోపులాటలో టూటౌన్ సీఐ లక్ష్మీబాబు కిందపడిపోయారు. తర్వాత ఇరువర్గాలు నడిరోడ్డుపై చెరోవైపు బైఠాయించి నినాదాలు చేశాయి. కాసేపటికే పెద్ద సంఖ్యలో పోలీసులు తెలంగాణ చౌక్​కు చేరుకున్నారు. బీజేపీ నేతలు, కార్యకర్తలను బలవంతంగా ఈడ్చుకెళ్లి పోలీసులు వెహికల్స్​లో ఎక్కించి.. టూటౌన్​ పోలీస్​స్టేషన్​కు తరలించారు. అటు టీఆర్ఎస్​ కార్యకర్తలనూ పోలీసులు అదుపులోకి తీసుకుని వన్​టౌన్​కు తరలించారు. ధర్నా చేస్తున్న తమను పోలీసులు కొట్టారని, పిడిగుద్దులు కురిపించారని.. కొందరికి గాయాలయ్యాయని బీజేవైఎం జిల్లా మాజీ అధ్యక్షుడు బోయినపల్లి ప్రవీణ్  తెలిపారు. టీఆర్ఎస్వీ  వాళ్లను గంట సేపట్లో వదిలేసి.. బీజేపీ వాళ్లను మాత్రం సాయంత్రం ఐదింటిదాకా పోలీస్​స్టేషన్లోనే ఉంచారని చెప్పారు.

ఇవి కూడా చదవండి..

ఆరున్నరేళ్లుగా పెద్దసార్లను మార్చట్లె!

రైతులు పంటలను మార్కెట్​లోనే అమ్ముకోవాలె

ప్రాణహిత ప్రవాహం తగ్గింది.. యాసంగికి నీళ్లెట్ల..?

పీహెచ్‌‌‌‌సీ నుంచే పెద్ద డాక్టర్‌‌‌‌కు చూపెట్టుకోవచ్చు