ఓయూ, వెలుగు: సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్తో ఉస్మానియా యూనివర్సిటీ పరస్పర అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. దీని ద్వారా ఓయూ ఇంజినీరింగ్ కాలేజ్ మైనింగ్ విభాగంలో సింగరేణి కాలరీస్ కంపెనీ చైర్ ఏర్పాటు చేసింది. ఫలితంగా మౌళిక వసతులు, అధ్యాపకుల కొరతను తీర్చేందుకు అవసరమైన నిధులు సమకూరనున్నాయి. ఎంఓయూలో భాగంగా సింగరేణి సీఎండీ ఎన్.శ్రీధర్ రూ.3 కోట్ల గ్రాంట్ను ఓయూ వీసీ ప్రొఫెసర్ రవీందర్ యాదవ్కు అందించారు. దీంతోపాటు సింగరేణితో కలిసి జాయింట్గా ఓయూ మరో నిర్ణయం తీసుకుంది.
రాష్ట్ర విశ్వవిద్యాలయాల్లో మొదటి సారిగా మైనింగ్ ఇంజినీరింగ్ విభాగంలో పనిచేసేందుకు ప్రొఫెసర్ ఆఫ్ ప్రాక్టీస్ కింద ఇద్దరు సింగరేణి ఉద్యోగులకు ఉత్తర్వులు ఇచ్చింది. దేశంలోనే ఇది మొదటిసారి అని ఒప్పందంలో పేర్కొంది. ఈ సందర్భంగా సింగరేణి సీఎండీ మాట్లాడుతూ.. ఓయూకు కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద సహకారాన్ని అందించటం ఆనందంగా ఉందన్నారు. మౌలిక వసతుల కల్పన, పరిశోధన సహా అన్ని అంశాల్లో సహకరించేందుకు సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు. మైనింగ్ అలుమ్నీ అసోసియేషన్ ఉపాధ్యక్షుడు అమర్ నాథ్, ప్రొఫెసర్లు, రీసెర్చ్ స్కాలర్లు, స్టూడెంట్లు పాల్గొన్నారు.