- ఆదివారం 18 జిల్లాలు.. సోమవారం 32 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ
- భద్రాచలం, మహబూబ్నగర్లో 40 డిగ్రీలు దాటిన ఉష్ణోగ్రతలు
- ఎల్లుండి నుంచి నాలుగు రోజుల పాటు వానలు
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో నాలుగు రోజుల పాటు వడగండ్ల వానలు పడే అవకాశముంది. ఆదివారం నుంచి మంగళవారం వరకు రాష్ట్రమంతటా విస్తారంగా వర్షాలు పడుతాయని, కొన్ని జిల్లాల్లో భారీ వర్షాలకు చాన్స్ ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఆదివారం 18 జిల్లాలు.. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మెదక్, కామారెడ్డికి ఎల్లో అలర్ట్ జారీ చేసింది. సోమవారం ఆయా జిల్లాలతో పాటు మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, జనగామ, సిద్దిపేట, యాదాద్రి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, వికారాబాద్, సంగారెడ్డి, కామారెడ్డి, మహబూబ్నగర్, నాగర్కర్నూల్ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. మొత్తంగా ఆరోజు 32 జిల్లాల్లోనూ వర్షాలు పడుతాయని తెలిపింది. మంగళ, బుధవారాలకు ఎలాంటి అలర్ట్ జారీ చేయకపోయినా.. పలు జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. అలర్ట్ జారీ చేసిన రోజుల్లో మాత్రం వడగండ్లు పడే ప్రమాదం ఎక్కువగా ఉందని హెచ్చరించింది.
రెండు జిల్లాల్లో 40 డిగ్రీలు
రాష్ట్రంలో టెంపరేచర్లు పెరుగుతున్నాయి. గురువారం 2 జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 40 డిగ్రీల మార్క్ను దాటాయి. భద్రాచలంలో గరిష్టంగా 40.2 డిగ్రీల టెంపరేచర్ నమోదైంది. మహబూబ్నగర్లోనూ 40 డిగ్రీల ఉష్ణోగ్రత రికార్డయింది. ఆదిలాబాద్లో 39.3, ఖమ్మంలో 39, నిజామాబాద్లో 38.8, రామగుండంలో 38, హైదరాబాద్లో 37.2 చొప్పున ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. కాగా, రాష్ట్రంలో వర్షాలతో పాటే ఎండలు కూడా తీవ్రమవుతాయని వాతావరణ శాఖ తెలిపింది.
