సెప్టెంబర్ 17ను జాతీయ సమైక్యతా దినోత్సవంగా ప్రకటించాలి

సెప్టెంబర్ 17ను జాతీయ సమైక్యతా దినోత్సవంగా ప్రకటించాలి

సెప్టెంబర్ 17ను జాతీయ సమైక్యతా దినోత్సవంగా ప్రకటించాలని ఎంఐఎం చీఫ్ అసదుద్దిన్ ఒవైసీ డిమాండ్ చేశారు. ఈ మేరకు కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు లేఖ రాశారు. బీజేపీ అధికారంలోకి వచ్చిన ఎనిమిదేండ్లల్లో సెప్టెంబర్ 17ను ఎందుకు అధికారికంగా నిర్వహించలేదని ప్రశ్నించారు. సెప్టెంబర్ 17న ఓల్డ్ సిటీలో భారీ తిరంగా ర్యాలీ చేపడుతామన్నారు.  తెలంగాణ విమోచనం కోసం హిందూ -ముస్లింలు కలిసిపోరాడారని ఒవైసీ గుర్తు చేశారు. వలసవాదం, భూస్వామ్యవాదం , నిరంకుశత్వానికి వ్యతిరేకంగా అప్పటి హైదరాబాద్ రాష్ట్ర ప్రజలు చేసిన పోరాటాలు కేవలం ఒక భూభాగాన్ని "విముక్తి" చేయడానికి మాత్రమే కాదన్నారు. హైదరాబాద్ రాష్ట్ర ప్రజలపై దాడులకు తెగబడ్డ రజాకార్లు అప్పుడే పాకిస్థాన్కు వెళ్లిపోయారని చెప్పారు. భారత్లో భాగంగా ఉండాలనుకున్న వఫాదార్లే ఇక్కడ ఉన్నారని ఒవైసీ తెలిపారు 

సెప్టెంబర్ 17ను వ్యతిరేకించలేదు
సెప్టెంబరు 17న తెలంగాణ విమోచన దినోత్సవం నిర్వహించాలని కేంద్రం నిర్ణయించిందని అసదుద్దీన్ ఒవైసీ అన్నారు. ఈ అంశంపై కేంద్ర హోం  మంత్రి అమిత్ షా, సీఎం కేసీఆర్ కు లేఖలు రాసినట్లు చెప్పారు. సెప్టెంబరు 17న హైదరాబాద్ సంస్థానం విలీమైన రోజు అని గుర్తు చేశారు. సెప్టెంబర్ 17ను ఎంఐఎం ఎప్పుడూ వ్యతిరేకించలేదన్నారు. హైదరాబాద్ సంస్థానం విలీనం కోసం తుర్రేబాజ్ ఖాన్, మగ్ధూం మోహిద్దీన్ వీరోచిత పోరాటం చేశారని..వారి సేవలను మరిచిపోవద్దన్నారు.  సెప్టెంబరు 17ను పురస్కరించుకుని  పాతబస్తీలో బహిరంగ సభ నిర్వహిస్తామని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఎంఐఎం ఎమ్మెలంతా పాల్గొంటారని తెలిపారు. సెప్టెంబరు 17న పాతబస్తీలో బైక్ ర్యాలీ నిర్వహిస్తామని...ఈ కార్యక్రమంలో అన్ని వర్గాల ప్రజలు భాగస్వాములు కావాలని కోరారు.