హైదరాబాద్, వెలుగు: హైదరాబాద్లో తమను ఓడించడం సాధ్యంకాక కొందరు కుట్రలు చేస్తున్నారని, తమను చంపాలని చూస్తున్నారని ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ అన్నారు. వైద్యం పేరుతో తమను హత్య చేసేందుకు ప్లాన్ వేస్తున్నారని ఆరోపించారు. సార్వత్రిక ఎన్నికల వేళ అక్బరుద్దీన్ చేసిన ఈ వ్యాఖ్యలు హాట్టాపిక్గా మారాయి. మంగళవారం ఆయన పాతబస్తీలో ఎంఐఎం సమావేశంలో పాల్గొని, మాట్లాడారు.
‘మరణం ఎలా వస్తుందో చెప్పలేం.. ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరికి తెలుసు.. కొంతమంది మా ఒవైసీ బ్రదర్స్ను జైలుకు పంపాలని చూస్తున్నారు. వైద్యం పేరుతో హాస్పిటల్కు తీసుకుపోయి స్లో పాయిజన్ ఇచ్చి.. మమ్మల్ని హత్య చేస్తారనిపిస్తోంది’ అని వ్యాఖ్యానించారు. హైదరాబాద్లో తాము చాలా బలంగా ఉన్నామని, అందుకే మమ్మల్ని ఓడించేందుకు యత్నిస్తున్నారన్నారు. ఎవరు ఎన్ని విధాలుగా ప్రయత్నించినా గెలిచేది తామేనని అక్బరుద్దీన్ అన్నారు.